టీఆర్ఎస్ వాళ్లంతే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు ఇటీవల పార్లమెంటు ఆమోదం తెలిపిన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 15 నిమాషాలపాటు మాట్లాడారు.
టీఆర్ఎస్ వాళ్లంతే..
పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రధాని స్పందించారు. టీఆర్ఎస్ వాళ్లు అలాగే ఉంటారని అన్నారు. దేశంలో కుటుంబ పార్టీలు కనుమరుగవుతున్నాయని చెప్పిన ఆయన.. పలు రాష్ట్రాలను ఉదాహరణగా చెప్పారు.
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీనే..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీనే గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కష్టపడి పని చేయాలని రాష్ట్ర ఎంపీలకు ఆయన సూచించారు. అనంతరం తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందరినీ కలుపుకోవాలని సూచించారు.
మోడీకి సమ్మక్క, సారలమ్మ ప్రసాదం..
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని అందిచ్చారు. ఈ సందర్బంగా సమ్మక్క, సారలమ్మ దేవతల విశిష్టత గురించి ఎంపీ గరికపాటి ప్రధాని మోడీకి వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పార్టీకి సంబంధించిన పలు అంశాలను మోడీతో తెలంగాణ ఎంపీలు చర్చించారు.
దిశ ఎన్ కౌంటర్పై మోడీ ఆరా..
కాగా, దిశ నిందితుల ఎన్ కౌంటర్పైనా ఆరా తీశారు. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి ప్రధాని తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు రోజు క్రితమే తీర్పునిచ్చిందని, వేచి చూడాలని ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
అమల్లోకి పౌరసత్వ సవరణ బిల్లు
ఇది ఇలావుంటే, పార్లమెంటులో తాజాగా పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదించింది. సౌరసత్వ సవరణ బిల్లుకు 311 మంది సభ్యులు అనుకూలంగా, 80 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇక బుధవారం రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. 105 మంది సభ్యులు వ్యతిరేకంగా, 120 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో రాజ్యసభలో కూడా సౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసకు గురై డిసెంబర్ 31, 2014కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లింమేతరులకు నిబంధనల ఆధారంగా ఇక్కడి పౌరసత్వం కల్పించనున్నారు.