పద్మ అవార్డు గ్రహితలకు సీజేఐ సత్కారం.. పుష్పగుచ్చం అందజేత
పద్మ పురస్కారాలు గెలుచుకున్న వారికి అవార్డుల ప్రదానం జరిగింది. వరసగా రెండోరోజులు అందజేశారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డులు స్వీకరించిన వారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర ఎల్లా, పద్మశ్రీ అవార్డులు అందుకున్న కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య, ప్రముఖ నటి షావుకారు జానకికి సీజేఐ ఎన్వీ రమణ పుష్పగుచ్ఛం ఇచ్చి, సన్మానించారు.
పద్మ అవార్డు గ్రహితలను అభినందించారు. నటి షావుకారు జానకితో సీజేఐ ఎన్వీ రమణ ముచ్చటించారు. తెలుగు వారికి పద్మ అవార్డులు రావడం సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నటి షావుకారు జానకికి అవార్డు రావడం చాలా సంతోషం అని తెలిపారు. కన్నడ, మలయాళీ భాషల వారు చాలా సంతోషం పడుతున్నారని పేర్కొన్నారు. 450 సినిమాల్లో నటి షావుకారు జానకి నటించారని ఆయన గుర్తుచేశారు. ఎన్టీ రామారావు, జయలలిత, ఎంజీఆర్ ఇతరులతో నటించారని చెప్పారు. నటి షావుకారు జానకి తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నారు. సమ్మక్క సారాలమ్మ చరిత్ర గురించి 24 గంటల పాటు చెప్పడం గొప్ప విషయమని చెప్పారు.
కళాకారుడు సకిని రామచంద్రయ్యకు సీజేఐ ఎన్వీ రమణ శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి భారత్ బయోటెక్ సంస్థను నిర్మించారని పేర్కొన్నారు. భారత దేశ గౌరవాన్ని ప్రపంచంలో ఖ్యాతిని చాటారని కొనియాడారు. దీర్ఘకాలిక వ్యాధులకు అనేక మందులు, వ్యాక్సిన్ లు తయారు చేయాలని కోరుకుంటున్నానని అభిలషించారు.