CJP: రేపు దేశవ్యాప్తంగా..! కాక్రోచ్ జనతా పార్టీ సంచలన పిలుపు..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పేపర్ లీక్స్, ఇతర అక్రమాలకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ లో కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తాజాగా పార్లమెంట్ మార్చ్ నిర్వహణకు ప్రయత్నించింది. దీంతో ఢిల్లీ పోలీసులు విద్యార్దులపై భారీ ఎత్తున దాడులు చేసి నిలువరించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున విద్యార్ధులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల దమనకాండను నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యకు నిరసనగా జూలై 24న దేశవ్యాప్త శాంతియుత నిరసనకు పిలుపునిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. నీట్ ఆందోళన సందర్భంగా విద్యార్థులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న సీజేపీ.. ఇందుకు నిరసనగా.. దేశంలోని ప్రతి జిల్లాలో ప్రదర్శనలు నిర్వహించాలని కోరింది. అయితే ఈ నిరసన శాంతియుతంగానే చేయాలని విద్యార్ధుల్ని కోరింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు స్థానికంగా సమన్వయం చేసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను బహిరంగంగా చదివి వినిపించాలని, పోలీసుల చర్య వల్ల ప్రభావితమైన వారికి సంఘీభావం తెలపాలని కాక్రోచ్ పార్టీ కోరింది.

ఢిల్లీలో చేపడుతున్న నిరసనలపై కేంద్రం ఇప్పటివరకూ స్పందించకపోవడం, మరోవైపు పోలీసులు కేసులు, నిర్బంధాలతో ఇబ్బంది పెడుతున్న తరుణంలో దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం ద్వారా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని కాక్రోచ్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఉద్యమానికి ఇప్పటికే దాదాపు అన్ని విపక్ష పార్టీలు జంతర్ మంతర్ కు వచ్చి మరీ మద్దతు ప్రకటించాయి. వీరంతా రేపు విద్యార్దులు చేపట్టే ఆందోళనల్లో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్రం పార్లమెంట్ లో నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్దమని ప్రకటించినా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించకపోవడంతో ఇప్పటికే ఉభయసభల్లో కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు.












Click it and Unblock the Notifications