వామపక్షాలనే వెళ్లగొట్టాం.. బీజేపీని గద్దె దింపడం కష్టమా..? : అఖిలేశ్కు మమతా మద్దతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. ప్రధాన పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. అధికారం కైవసం చేసుకునేందుకు పదునైనా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కర్హల్ స్థానం నుంచి తొలి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆయనపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి దించడం లేదు. ఇది కేవలం మర్యాద పూర్వకమైన నిర్ణయమని కాంగ్రెస్ తెలిపింది. తాజాగా మరో కీలక పార్టీ కూడా అఖిలేశ్ యాదవ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

సమాజ్ వాదీ పార్టీకి మమతా మద్దతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నిల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దీదీ ప్రకటించారు. యూపీలో బీజేపీని తరిమి కొట్టేందుకే తమ మద్దతు ఎస్పీకి ఇస్తున్నట్లు తెలిపారు. టీఎంసీ కార్యకర్తలు సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి..
తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా మరో సారి మమతా బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె తమ ఎన్నికల ప్రణాళికలను వెల్లడించారు తాము ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తుందని దీదీ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే తమ పార్టీతో బీజేపీకి చెందిన ఎనిమిది మంది కీలక నేతలు టచ్ లో ఉన్నారని తెలిపారు. టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

దేశంలో బీజేపీని లేకుండా తరిమి కొడతాం
దేశంలో బీజేపీని లేకుండా తరిమి కొడతామని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో బలంగా వేళ్లూనుకున్న వామపక్షాలనే వెళ్లగొట్టగలిగామని, బీజేపీని అధికారంలో నుంచి దింపేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. టీఎంసీ పశ్చిమ బెంగాల్ వరకు పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించిందన్నారు. గోవా, త్రిపురలోనూ తమకు బలమైన ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. బెంగాల్లో తమ పార్టీని మరింత పటిష్టంగా చేస్తామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 42 పార్లమెంటు స్థానాలనూ కైవసం చేసుకుంటామని దీదీ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications