నితీష్ కమార్ అనూహ్య ప్రకటన..!!
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బిహార్. అక్టోబర్/నవంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే.
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్నివహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ఆగస్టు 1వ తేదీ నుంచి గృహావసర విద్యుత్ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. మొదటి నుండి అందరికీ తక్కువ ధరలకే విద్యుత్ అందిస్తోన్నామని, ఇప్పుడు ఆగస్టు 1 నుండి 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అమలు చేయనున్నామని నితీష్ కుమార్ చెప్పారు.
జూలై నెల విద్యుత్ బిల్లులో ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులు ఎవరూ 125 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.
పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడానికి, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి, ఉన్నత వర్గాలతో సమానంగా రాణించేలా చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తోన్నామని పేర్కొంది. రాబోయే మూడేళ్లలో వారి ఇళ్లపై లేదా సమీపంలోని ప్రభుత్వ స్థలాలలో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసి మరింత ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలను రూపొందించుకుంటోంది బిహార్ లో
కుటీర్ జ్యోతి యోజన కింద ఉన్న పేద కుటుంబాలకు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసే పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన వారికి ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. దీనివల్ల గృహావసర విద్యుత్ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
అదే సమయంలో రాష్ట్రం రాబోయే మూడేళ్లలో దాదాపు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని నితీష్ కుమార్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. తాజా నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బీహార్లో చాలా కుటుంబాలకు విద్యుత్ బిల్లులు ప్రధాన ఖర్చుగా ఉన్నాయి.
125 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ పథకం ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సహాయపడుతుంది. ఇది నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును పెంచే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications