ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వేళ విజయ్ ఊహించని రాజకీయం..!!
తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం విజయ్ పక్కా ప్రణాళికా బద్దంగా తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. డీఎంకే- అన్నా డీఎంకే పైన గురి పెట్టారు. విజయ్ కూటమి బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ ప్రభుత్వం కూల్చేందుకు కుట్రలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో, విజయ్ అప్రమత్తం అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటంతో పాటుగా ప్రధాన ప్రత్యర్థుల పైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. తన దైన రాజకీయంతో ముందుకు వెళ్తున్నారు.
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని మాజీ సీఎం స్టాలిన్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. విజయ్ కు తమ మాజీ మిత్రపక్షాల మద్దతు ఇవ్వటంతోనే ప్రభుత్వం కొనసాగుతుందని చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తాజా పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కుట్రపై దర్యాప్తు చేపట్టారు. కాగా, అటు టీవీకే కు మద్దతుగా నిలిచిన పార్టీలతో కూటమి ఐక్యత చాటుతూ తాజాగా పార్టీల నేతలు ఒకే వేదిక పైన కీలక ప్రకటన చేసారు. విజయ్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని స్పష్టం చేసారు.
కూటమి బలోపేతంతో కొత్త వ్యూహాలు
కాగా.. తాజా పరిణామాల పై సీఎం విజయ్ గట్టి సమాధానమిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం కూలిపో తుందంటూ ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం పూర్తి కాలం విజయ వంతంగా కొనసాగుతుందని సీఎం విజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను దెబ్బతీయా లని చూసే వారి వ్యూహాలు ఫలించవని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు, కూటమి గమనంపై మాట్లాడిన ముఖ్యమంత్రి, తమ ప్రయాణంలో రెండు ప్రధాన సూత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ, లౌకికవాద విలువలను కాపాడతామని చెప్పారు. 'అవినీతిరహిత పాలన, లౌకికవాదం అనేవి మా ప్రభుత్వానికి రెండు కళ్లు. ఈ రెండు కీలక అంశాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు' అని విజయ్ తేల్చి చెప్పారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ మరింత సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications