సీఎంగా విజయ్ ఫస్ట్ అసైన్ మెంట్.. !!
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం క్రమంగా కుదురుకుంటోంది. విజయ్ ఢిల్లీ పర్యటనకు సైతం వెళ్లొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. అటు పాలనపై కూడా విజయ్ పట్టు పెంచుకుంటోన్నారు. ఈ క్రమంలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలను చేపట్టారు. ఒకే విడతలో మొత్తం 32 మంది ఐఎఎస్ లను బదిలీ చేశారు.
ఇప్పుడిక మళ్లీ ప్రజలతో మమేకం అయ్యే దిశగా అడుగులు వేస్తోన్నారు. ఈ క్రమంలో తిరుచిరాపల్లిలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారాయన. జూన్ 1న సోమవారం ఈ సభ ఏర్పాటైంది. దీనికి సంబంధించిన పనులు అక్కడ చురుగ్గా సాగుతున్నాయి కూడా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ నిర్వహించబోతోన్న తొలి బహిరంగ సభ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పైగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన నియోజకవర్గం కూడా ఇదే. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేసిన విజయ్.. రెండు చోట్లా విజయదుందుభి మోగించారు. పెరంబూర్ స్థానంలో కొనసాగుతూ తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లకు ధన్యవాదాలను తెలియజేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రిగా తన మొదటి బహిరంగ సభను అక్కడే నిర్వహిస్తోన్నారు విజయ్.
సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుండి తిరుచిరాపల్లి చేరుకుంటారు విజయ్. అక్కడి ఛత్రం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరిగే కృతజ్ఞతా సమావేశంలో పాల్గొంటారు. భారీ జన సందోహం దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను చేపట్టారు. టీవీకే డెల్టా రీజియన్ పార్టీ అబ్జర్వర్ ఉప్పా కృష్ణన్ ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
ఈ సభ సందర్భంగా విజయ్ కొన్ని కీలక ప్రకటనలు వెలువడించే అవకాశం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల్లో ఒకట్రెండింటి అమలు తేదీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి టీవీకే తరఫున అభ్యర్థిని సైతం అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. మహిళను అభ్యర్థిగా నిలుపుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications