ఎన్నికల వేళ ఉచిత హామీల పాట: స్మార్ట్ ఫోన్ల నుంచి టిఫిన్ బాక్సుల వరకు అన్ని ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ
ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయపార్టీలు ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం భారీ స్థాయిలో వరాలు ప్రకటిస్తున్నాయి. ఈ సారి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి ఉచిత డేటా వరకు, టిఫిన్ బాక్స్ నుంచి ఉచిత కరెంట్, ఉద్యోగాల వరకు..ఇలా అన్నీ వరాలు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు రోడ్లు, వంతెనలు కూడా నిర్మిస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
వరాలు ప్రకటిస్తే బడ్జెట్లో 35శాతం నిధులు
రాజకీయ పార్టీలు ప్రకటించిన వరాలు అమలు చేయాలంటే బడ్జెట్లో కేటాయించిన 35శాతం నిధులు వినియోగించాల్సి ఉంటుంది. సరైన ప్రణాళిక లేకుండా వరాలు ప్రకటించడం వల్ల... దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఓటర్లకు వరాలు ప్రకటించొద్దని చట్టంలో లేదని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే ఎలాంటి వరాలు ప్రకటించకూడదని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఉచిత వరాలపై సుప్రీంకోర్టులో పిటిషన్
రాజకీయ పార్టీలు ఉచిత వరాలు ప్రకటించడం సరికాదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో, ఉచిత వరాలపై ఎలక్షన్ కమిషన్ ఓ కన్ను వేయాల్సిఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆయా రాజకీయపార్టీలతో సమావేశమైన ఎన్నికల సంఘం మేనిఫెస్టో రూపకల్పనపై కొన్ని మార్గదర్శకాలు సూచించింది. అయితే ఆయా రాజకీయపార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాలపై తాము నిర్ణయం తీసుకోలేమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
"ఎన్నికల సంఘం అన్నీ చేసేందుకు అధికారం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. అంటే ఒక ఎన్నికలు జరిగేందుకు 45 రోజుల సమయం వరకు ఈసీ అన్నిటిపై కన్ను వేస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత వరాల ప్రకటన ఎన్నికలకు కొన్ని నెలలముందే ఇవ్వడం జరుగుతోంది"అని ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఖురేషీ అన్నారు. ఇప్పటి వరకు కరెంట్, నీరు, రోడ్లు అనే హామీలే రాజకీయపార్టీలు ఇస్తుండటంతో ప్రజలకు కూడా బోర్ కొట్టిందని.. అందుకే పార్టీలు సైకిళ్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు, సైకిళ్లు లాంటి కొత్త ఆలోచనకు తెరదీశాయని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.
నేతల వరాల జల్లు
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలో ఆ సీఎంలు అప్పుడే హామీలు కురిపిస్తున్నారు. కోటి మంది పేద ప్రజలకు స్మార్ట్ ఫోన్ అందించడమే కాకుండా మొదటి ఆరునెలల్లో ఉచిత డేటా అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే వరం ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. మరోవైపు ఛత్తీస్ఘఢ్ సీఎం రమణ్సింగ్ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికులకు టిఫిన్ బాక్స్లు ఇస్తానని హామీ ఇవ్వగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయక క్షణాల ముందు...కొన్ని ఆధ్యాత్మిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు వేతనాలు మూడురెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు.
రైతుబంధు: తెలంగాణ బ్యాంకులకు రూ.5400కోట్లు పంపిణీ చేసిన ఆర్బీఐ
ఎన్నికల సమయంలో రైతులే టార్గెట్
మధ్యప్రదేశ్ సీం శివరాజ్ సింగ్ చౌహాన్... తన ప్రచారంలో భాగంగా రైతు సంక్షేమం కోసం రూ.35వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి భూమి ఉన్న రైతుకు ఎకరాకు నగదును ప్రకటించారు. వసుంధర రాజే రాజస్థాన్ రైతులకు రుణమాఫీ ప్రకటించారు. కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు రూ.300 ప్రకటించారు చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్.
ఉచిత వరాలతో ముప్పే
ఉచిత వరాలు ఇవ్వడం ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదని...వరాలు ఇవ్వడం ఆర్థికంగా మంచిదికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజస్థాన్ యూనివర్శిటీలోని ఆర్థికశాఖలో పనిచేస్తున్న నిపుణులు విజయ్ వీర్ సింగ్. నేతలు ప్రకటిస్తున్న ఉచిత వరాలు పేపర్పై చూసేందుకు బాగానే ఉంటాయని అమలుకు మాత్రం నోచుకోవని.. ఒకవేళ అమలు చేయాలంటే పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుందని మరో ఆర్థిక నిపుణుల జయంతిలాల్ భండారీ చెప్పారు.
విపక్షాలు
ప్రభుత్వం ప్రజలకు అన్ని ఉచిత హామీలు ఇస్తుందంటే ... ప్రభుత్వం వైఫల్యం చెందినట్లేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉచిత హామీలు ఇచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తాయి. ప్రభుత్వం ప్రజలకు అన్నీ చేసి ఉంటే మళ్లీ అమలు కానీ హామీలు ఎందుకు ఇస్తున్నారని రాజస్థాన్ సీఎం వసుంధర రాజేను ఉద్దేశించి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ సచిన్ పైలట్ ప్రశ్నించారు.