ఎంఎస్పీ లేకుంటే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం ఖట్టర్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: రైతులను నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన ప్రకటన చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందని, అలా జరగని పక్షంలో తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
హర్యానాలో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా కనీస మద్దతు ధరను తొలగించాలని ప్రయత్నిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఏఎన్ఐతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు. తాజాగా, జరిగిన ఐదు మున్సిపల్ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓటమిని చవిచూసింది.
ఈ నేపథ్యంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం తీసుకొచ్చిన మూడూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఇటీవల హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత దుశ్యంత్ చౌతాలా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో జేజేపీ భాగస్వామ్యం ఉన్న విషయం తెలిసిందే. 'ఎంఎస్పీ కొనసాగుతుందని మా పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. కేంద్రం కూడా ఎంఎస్పీ కొనసాగుతుందని రాతపూర్వకంగా స్పష్టం చేసింది. ఆ హామీ నెరవేరకుంటే నేను నా పదవికి రాజీనామా చేస్తాను' అని దుశ్యంత్ చౌతాలా వ్యాఖ్యానించారు.
ఆదివారం అంబాలా, పంచకుల, సోనిపేట్ నగరాల్లో మేయర్ ఎన్నికలు జరిగాయి. పంచకులలో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, హచ్జేసీపీ పార్టీలు సోనిపేట్, అంబాలాలను కైవసం చేసుకున్నాయి. ఈ మూడు నగరాల్లో తొలిసారి మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి.