బిజెపితో విజయ్కాంత్ డిఎండికె పొత్తు ఖరారు!
చెన్నై: చాలా కాలంగా ఉత్కంఠతో కొనసాగిన తమిళ నటుడు విజయ్కాంత్ నేతృత్వంలోని డిఎండికె, భారతీయ జనతా పార్టీల పొత్తు విషయం ఓ కొలిక్కి వచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడు రాష్ట్రంలో డిఎండికె-బిజెపిలు పొత్తు పెట్టుకునేందుకు సానుకూలత వ్యక్తం చేయడంతో పొత్తు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.
డిఎండికె పార్టీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. సోమవారం చెన్నైలోని ఓ హోటల్ బస చేసిన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని విజయ్కాంత్ బావమరిది ఎల్కె కలిశారని తెలిసింది. ఆ సమయంలోనే ఇరు పార్టీల పొత్తుపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. డిఎండికె పొత్తు విషయంపై బిజెపితో చర్చలు జరిపిందని, అయితే సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డిఎండికె వర్గాలు తెలిపాయి.
డిఎండికె 14 సీట్లు కేటాయించాలని కోరుతోందని, అయితే తాము 12 సీట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్రానికి చెందిన ఓ బిజెపి సీనియర్ నాయకుడు తెలిపారు. రాష్ట్రంలోని మరో పార్టీ అయిన పిఎంకెతో కూడా బిజెపి పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఫిబ్రవరి చివరి వరకు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇరు పార్టీలకు లబ్ధి చేకూరుతుందని పిఎంకె పార్టీ నేతలకు బిజెపి వర్గాలు వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఇరు పార్టీలు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే బిజెపితో వైకో నేతృత్వంలోని ఎండిఎంకె పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఎండికె.. కాంగ్రెస్, డిఎంకెలతో కలిసి పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు కూడా మరికొన్ని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.