సుమలత ఎంత దిగజారారో చూడండి: సీఎం సోదరుడి తీవ్రవ్యాఖ్య, సారీ చెప్పిన కుమారస్వామి
బెంగళూరు: ప్రముఖ నటి, దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలతపై కర్ణాటక మంత్రి రేవణ్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. దీనిపై రేవణ్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుమలత తన భర్త పోయారని బాధపడాల్సిందిపోయి, అప్పుడే రాజకీయంగా పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారని, ఎంతగా దిగజారిపాయోరో చూడాలన్నారు.

దుమారం రేపిన రేవణ్ణ వ్యాఖ్యలు
రేవణ్ణ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సుమలత స్పందించారు. ఆయన అలా మాట్లాడినందుకు తనకు బాధగా లేదని, ఆ వ్యాఖ్యలు తనను మరింత దృఢంగా చేశాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని తాను తీసుకున్న నిర్ణయానికి మరింత బలం ఇచ్చాయన్నారు.

రేవణ్ణ తనను మాత్రమే అనలేదు
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎవరైనా టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నారా అని ఓ విలేకరి అడిగారు. దానికి సుమలత స్పందిస్తూ.. అది తనకు తెలియదని, ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీలపై ప్రజలు ఆసక్తి కోల్పోతున్న సమయంలో మనం వారి కోసం ఏదో చేయాలనుకుంటామని, అదే సమయం ఇది అన్నారు. యువత మనపై ఆశలు పెట్టుకుందన్నారు. మన నుంచి స్ఫూర్తి కోరుకుంటున్నారని చెప్పారు. తన భర్త విషయంలో తనను కామెంట్ చేసిన వారి మెంటాలిటీ ఏమిటో ఇప్పుడే తేలిపోయిందని రేవణ్ణను ఉద్దేశించి అన్నారు. మహిళల పట్ల రాజకీయాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో రేవణ్ణ వ్యాఖ్యలతో తెలిసిందన్నారు. ఆయన తన గురించి మాట్లాడినట్లుగా భావించడం లేదని, మహిళలను అవమానించారన్నారు.

కర్ణాటక సీఎం క్షమాపణలు
కాగా, రేవణ్ణ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం కుమారస్వామి క్షమాపణలు చెప్పారు. తమ కుటుంబం ఎప్పుడూ మహిళలను చిన్నచూపు చూడలేదని, అలాంటిదీ బహిరంగంగా స్త్రీలను అవమానించే సంస్కృతి తమది కాదని, రేవణ్ణ వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని, మరోసారి ఇలా జరగదన్నారు. అసలు ఇదంతా జరగడానికి మీడియానే కారణమని మండిపడ్డారు. మీడియా వాళ్లే రేవణ్ణను ఆ ప్రశ్న అడిగారని, కానీ రేవణ్ణ అడిగినట్లు తప్పుగా చిత్రీకరించారన్నారు. కాగా సీఎం కొడుకు నిఖిల్ కూడా సుమలతకు సారీ చెప్పారు. ఆమె తమ ఇంటి ఆడపడుచు లాంటివారు అన్నారు. కాగా, తన భర్త అంబరీష్ పోటీ చేసిన మాండ్య నుంచి పోటీ చేసేందుకు సుమలత ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications