లోక్సభలో రాహుల్ సీటుపై రచ్చ..
ఢిల్లీ : లోక్సభలో కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు విషయంలో రచ్చ జరుగుతోంది. ముందు వరుసలో ఆయనకు సీటు కేటాయించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్కు సీటు కేటాయింపు అంశంపై స్పందించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్సభ ముందు వరుసలో సీటు కేటాయించాలని తామెప్పుడూ కోరలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాహుల్ గానీ, పార్టీ నుంచి గానీ ఈ విధమైన డిమాండ్ ఎప్పుడూ చేయలేదని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.
లోక్సభలో పార్టీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఆయా పార్టీలకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ క్రమంలో 52మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరీ కోసం ముందు వరుసలో రెండు సీట్లు కేటాయించారు. దీంతో రాహుల్ కోసం అదనంగా మరో సీటు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదన్న అధిర్ రంజన్ చౌదరీ రాహుల్ కోసం తాము 466వ సీటు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాహుల్.. సోనియాగాంధీ పక్కనే కూర్చుని ఉండటం విశేషం.
Neither Rahul Ji nor Congress Party have ever put forward any demand for "Front Row" seat at Parliament for @RahulGandhi ji
— Adhir Chowdhury (@adhirrcinc) July 9, 2019
We have proposed seat no. 466 for Rahul Gandhi ji#Desist from false propaganda
లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యతవహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ సీనియర్లు నచ్చజెప్పినా.. కార్యకర్తలు అభ్యర్థించినా ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో రాహుల్ స్థానంలో కొత్తగా పార్టీ బాద్యతలు ఎవరు చేపడతారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది.