ఎన్నికలు: కాంగ్రెస్-డీఎంకేల మధ్య దోస్తీ కుదిరింది
చెన్నై: 2016లో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్, డీఎంకే పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ శనివారం ఒక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే నమ్మకమైన మిత్రపక్షమని ఆయన తెలిపారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై త్వరలో ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో దాదాపు గంటకుపైగా చర్చలు జరిపిన అనంతరం పొత్తుపై ఆజాద్ మీడియాకు వెల్లడించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు పొత్తు కోసం శనివారం ఉదయం చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకే ఇళంగోవన్ తదితరులు సమావేశమయ్యారు.
2004 నుంచి 2013 వరకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగింది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల పొత్తు నుంచి డీఎంకే వైదొలగింది. ఆ తర్వాత 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేసిన డీఎంకే, కాంగ్రెస్లు ఘోర ఓటమిని చవిచూశాయి.
దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను ఎదుర్కోవాలంటే ఎక్కువ మంది మిత్రులను కూడగట్టుకోవడం డీఎంకేకు తప్పనిసరైంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత ఎక్కువమందితో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
Alliance with Congress is finalised, we haven't spoken about seats: MK Stalin, DMK on Tamil Nadu assembly polls pic.twitter.com/jSeV4T7PkN
— ANI (@ANI_news) February 13, 2016












Click it and Unblock the Notifications