కాంగ్రెస్ ఖతం! హస్తం పార్టీ హాహాకారాలు
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి. అస్సాం నుంచి తమిళనాడు వరకు, బెంగాల్ నుంచి కేరళ వరకు విస్తరించిన ఈ ఎన్నికల సంగ్రామంలో హస్తం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నీడలోనో లేదా ఉనికి చాటుకోలేని దీనావస్థలోనో కొట్టుమిట్టాడుతోంది.
కాంగ్రెస్ ఆశలన్నీ కేరళపైనే ఉండగా, అక్కడ 30 స్థానాల్లో విజయం, మరో 30 చోట్ల ఆధిక్యం దక్కడం మాత్రమే ఆ పార్టీకి కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. కానీ, జాతీయ స్థాయిలో పార్టీని నిలబెట్టేంత ప్రభంజనం అక్కడ కూడా కనిపించలేదు. కేరళలో పినరయి విజయన్ ప్రభావాన్ని తగ్గించడంలో సక్సెస్ అయినా, ఆ విజయం కేవలం ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నింపుతోంది.

అస్సాంలో వారసత్వానికి షాక్.. గౌరవ్ గొగోయ్ ఘోర ఓటమి!
అస్సాంలో హిమంత బిస్వా శర్మ కోటను బద్దలు కొడతామని భావించిన కాంగ్రెస్కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. మాజీ సీఎం తరుణ్ గొగోయ్ వారసుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న గౌరవ్ గొగోయ్.. స్వయంగా జోర్హాట్ నుంచి 23 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రియాంకా గాంధీ స్వయంగా ప్రచారం నిర్వహించినా, టిక్కెట్ల పంపిణీ పర్యవేక్షించినా బీజేపీ జోరును అడ్డుకోలేకపోయారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం కేవలం 20 స్థానాలకే పరిమితమవ్వడం అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని కళ్ళకు కడుతోంది.
బెంగాల్లో మాయం.. తమిళనాడులో వెనుకబాటు!
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరం. 294 స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం సాధించి, 3.25 శాతం ఓట్ల వాటాతో నామమాత్రపు పార్టీగా మిగిలిపోయింది. దీదీ వర్సెస్ మోదీ పోరులో కాంగ్రెస్ ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అటు తమిళనాడులో డీఎంకే వంటి బలమైన కూటమిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ తన స్ట్రైక్ రేట్ను మెరుగుపరుచుకోలేకపోయింది. 28 చోట్ల పోటీ చేసి కేవలం ఆరు స్థానాల్లోనే ఉనికి చాటుకోవడం పొత్తుల వల్ల వచ్చే లాభాన్ని పార్టీ సొంతం చేసుకోలేకపోతోందనే వాస్తవాన్ని చాటిచెప్పింది.
వ్యూహాత్మక వైఫల్యాలు.. లోపిస్తున్న నాయకత్వం!
ఎన్నికలకు ముందు సీనియర్ నేతలు బీజేపీలోకి వలస వెళ్లడం, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ను దెబ్బతీశాయి. అస్సాం వంటి రాష్ట్రాల్లో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, కేవలం వారసత్వంపైనే ఆధారపడటం ఓటర్లకు నచ్చలేదని స్పష్టమవుతోంది. ఇలాగే కొనసాగితే ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరిగి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉనికి మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications