మణిపూర్ దోపిడీపైనే కాంగ్రెస్ దృష్టి, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారు: ప్రధాని మోడీ విమర్శలు
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో రెండ్రోజుల్లో తుది దశ ఎన్నికలు జరగనున్న క్రమంలో వర్చవల్ పద్ధతిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మణిపూర్ రాష్ట్రంలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేసి బీజేపీని ఆశీర్వదించారని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మణిపూర్ ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. మణిపూర్ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేయలేదని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేదని మండిపడ్డారు.

మణిపూర్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి బీజేపీని అశ్వీర్వదిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ముఖ్యమంగా మణిపూర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని మోడీ తెలిపారు. ఇది వేర్పాటువాదుల, విచ్ఛిన్నకారుల కుట్రలను భగ్నం చేసిందని అన్నారు.
మణిపూర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందన్నారు ప్రధాని మోడీ. గో టూ హిల్, గో టూ విలేజ్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. మణిపూర్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలను చేపట్టిందన్నారు. ఇవన్నీ వేర్పాటువాదులను ఓడించాయన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేశాయన్నారు. మణిపూర్, ఈశాన్య రాష్ట్రాలు భారత ఐక్యతకు కేంద్ర బిందువులని ప్రధాని మోడీ అన్నారు.
మణిపూర్ను దోచుకోవడంపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిందని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయని కాంగ్రెస్ పార్టీ.. ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని మండిపడ్డారు. కానీ, బీజేపీ ప్రభుత్వం మణిపూర్ ప్రజలకు మద్దతుగా ఉంటూ వారి అభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మణిపూర్ తొలి రైలు కోసం వేచిచూసింది. భారతీయ రైల్వే నెట్వర్క్ ను కలుపుతూ బీజేపీ ప్రభుత్వం వారి ఆకాంక్షను నెరవేరుస్తోంది. మణిపూర్ రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు కూడా వస్తాయి అని ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించారు. మణిపూర్ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వమే సహకరించిందన్నారు. మణిపూర్ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మణిపూర్ రాష్ట్ర ప్రజల నైపుణ్యానికి, క్రీడలకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ. 100 స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇవన్నీ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు.
Recommended Video
మణిపూర్ రాష్ట్రంలో ఎయిమ్స్ నిర్మించాలని తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ సమయమని అన్నారు. ఈ దశాబ్ధం అభివృద్ధి, పురోగతికి చెందినదని.. మణిపూర్ రాష్ట్రం ఆ వైపుగా వేగంగా కదులుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications