కాంగ్రెస్ నాలుగో జాబితా.. అక్కడినుంచే శశిథరూర్.. కేవీ థామస్ కు మొండిచేయి
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు పార్టీ లీడర్లకు టికెట్లిచ్చే విషయంలో ముందుంది. ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదల చేసిన హస్తం పెద్దలు.. తాజాగా శనివారం నాడు నాలుగో జాబితా రిలీజ్ చేశారు. 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్ కు చోటు దక్కకపోవడం గమనార్హం. అలాగే కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తిరువనంతపురం నుంచే పోటీచేయనున్నారు. ఆ మేరకు నాలుగో జాబితాలో ఆయనకు స్థానం దక్కింది.
యూపీ పాలిటిక్స్ : అఖిలేశ్, మాయా వైరివర్గాలతో కాంగ్రెస్ చెట్టపట్టాల్
అభ్యర్థుల్లో ఉత్కంఠ
లోక్సభ ఎన్నికల కోసం సమాయత్తమైంది కాంగ్రెస్ పార్టీ. ఒక్కో జాబితా విడుదల చేస్తూ ఆశావహుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. శనివారం నాడు విడుదల చేసిన జాబితాలో కేవలం నాలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నేతల పేర్లు లేకపోవడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్ - 2, ఛత్తీస్ గఢ్ - 5, కేరళ - 12, అండమాన్ నికోబార్ - 1, ఉత్తర్ ప్రదేశ్ - 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్.
నో థామస్.. హిబి ఈడెన్ కు ఛాన్స్
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. ఈసారి కూడా అక్కడినుంచే పోటీచేయనున్నారు. ఆ మేరకు పార్టీ విడుదల చేసిన నాలుగో జాబితాలో ఆయనకు చోటు దక్కింది. అదలావుంటే కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్ (72 సం.) కు నాలుగో విడతలోనూ టికెట్ దక్కకపోవడం గమనార్హం. ఎర్నాకుళం లోక్సభ సెగ్మెంట్ నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు థామస్. ఈసారి కూడా అక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పెద్దలు ఆయన పేరును నాలుగో జాబితాలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. అదలావుంటే హైకమాండ్ నిర్ణయం తనను షాక్కు గురిచేసిందంటున్నారు థామస్.
ఎర్నాకుళం వైపే అందరిచూపు
అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకీ కి కాంగ్రెస్ నాలుగో జాబితాలో చోటు దక్కింది. అరుణాచల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో నిలవనున్నారు. అటు ఎర్నాకుళం నుంచి 35 ఏళ్ల వయసున్న హిబి ఈడెన్ కు టికెట్ దక్కడం విశేషం. ఎర్నాకుళం నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ కేవీ థామస్ ను పక్కనబెట్టి హిబి ఈడెన్ కు అవకాశం ఇవ్వడం చర్చానీయాంశంగా మారింది.