కాంగ్రెస్: మూడురోజుల మేథోమధనంలో ఒకటి మాత్రం స్పష్టం
రాజస్తాన్లోని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ మూడురోజులుగా మేథోమధన సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. నవ సంకల్ప చింతన్ శిబిర్లో ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి రాహుల్గాంధీ సిద్ధంగా లేకపోతే ప్రియాంకగాంధీని అధ్యక్షురాలిని చేయాలని డిమాండ్ చేశారు. అయితే తీర్మానంలో ఉన్న అంశాలనే మాట్లాడాలని, ఇటువంటివాటికి ఇక్కడ ఆస్కారం లేదని కమిటీ చైర్మన్ మల్లికార్జున్ఖర్గే స్పష్టం చేశారు.
అలాగే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సచిన్ పైలట్కు అప్పగించాలని అక్కడి నేతలు డిమాండ్ చేశారు. దాన్ని కూడా ఖర్గే తోసిపుచ్చారు. ఇటువంటి విషయాలు మాట్లాడే వేదిక ఇది కాదన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆరు ప్రధాన అంశాలపై ఎక్కువ చర్చ నడిచింది. ఆరు కమిటీలు రూపొందించిన ముసాయిదా నివేదికను సోనియాగాంధీకి అందజేశారు.
ప్రస్తుతానికి అధ్యక్ష పదవిపై ఎవరూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ కొద్దిరోజుల తర్వాతైనా నాయకత్వ మార్పు తథ్యమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతమవ్వాలంటే రాహుల్, సోనియాలాంటివారు చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుందని, ప్రజల్లో లభించే స్పందనను బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.
మహా పాదయాత్ర సమయంలోకానీ, ఆ తర్వాత కానీ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్ష పదవి తీసుకోవడానికి రాహుల్ పలుమార్లు నిరాకరించిన సంగతి తెలిసిందే. దాదాపుగా ప్రియాంకగాంధీ అధ్యక్షురాలవుతుందని భావిస్తున్నారు.