ఫైర్ బ్రాండ్ సిట్టింగ్ ఎంపీ మీద పోటీ చేస్తున్న నటి రమ్యా, డీకేశీ స్కెచ్ తో షాక్ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కనీసం 20 నియోజకవర్గాల్లోనైనా గెలవాలని సిద్దరామయ్య మంత్రివర్గానికి టార్గెట్ పెట్టింది. లోక్సభ ఎన్నికలపై సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు హైకమాండ్ నేతలతో చర్చించి పలు స్థానాల్లో విజయం సాధించేందుకు వ్యూహరచన చేసినట్లు సమాచారం.
ఏ నియోజక వర్గంలో ఎవరిని రంగంలోకి దింపాలనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావవంతమైన 14 మంది కేబినెట్ మంత్రులతో సహ బీజేపీలోని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా పవర్ ఫుల్ నేతలను ఓడించేందుకు తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఆలోచిస్తున్నారని, ఇదే విషయం కాంగ్రెస్ పార్టీతో ఆయన చర్చలు కూడా జరిపారని సమాచారం.

ఉపముఖ్యమంత్రి పదవితో పాటు బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి డీకే శివకుమార్ పని చేస్తున్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని డీకే శివకుమార్ సిద్ధమవుతున్నారని తెలిసింది, 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో రాజధాని బెంగళూరు పరిధిలో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా విజయం సాధించేలా డీకే శివకుమార్ ఇప్పటి నుంచి వ్యూహం రచించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్లో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్ ఎన్నికల నిపుణుల సలహా కోరినట్లు సమాచారం. గత 32 ఏళ్లుగా బెంగళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. ఈ లోక్ సభ నియోజక వర్గంలో ఇంత వరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎప్పుడూ గెలవలేదు. గతంలో కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ మరణించిన తర్వాత బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ, ఈసారి వందేళ్ల చరిత్ర ఉన్న బెంగళూరు సౌత్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని డీకే. శివకుమార్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. బెంగళూరు సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలిచిన తేజస్వి సూర్య బీజేపీ జాతీయ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యం తేజస్వి సూర్యకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. తేజస్వి సూర్య ఓడిపోతే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గంలో తేజస్వి సూర్యను ఓడించడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ పక్కాప్లాన్ చేస్తున్నారని వెలుగు చూసింది. బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సినీ నటి, మాజీ ఎంపీ రమ్యాను బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రమ్యా పాపులారిటీ బెంగుళూరులో వర్కవుట్ అవుతుందని, అలాగే రమ్యా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓట్లతో పాటు యువత, మహిళల ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడతాయన్నది కాంగ్రెస్ నేతల ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం పలుకుబడి పెంచుకున్న బీజేపీ నేతలను ఎలాగైనా ఓడించేందుకు ఇప్పటి నుంచి వ్యూహాన్ని అమలు చెయ్యడానికి సిద్దం అవుతోందని వెలుగు చూసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ లు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications