సోనియా గాంధీ ఈడీ సమన్లను జారీ చేసిన వేళ.. విదేశీ పర్యటనకు రాహుల్
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి సమన్లు అందుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమెకు రెండోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తుల కేసులో మనీ ల్యాండరింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.
ఇదివరకే రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సారి సోనియా గాంధీ హాజరు కావాల్సి ఉంది. తొలిసారిగా ఈడీ సమన్లను అందుకున్న సమయంలో కరోనా వైరస్ బారిన పడటం వల్ల విచారణకు గైర్హాజరయ్యారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు.అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేనని, మూడు వారాల గడువు కావాలంటూ సోనియా గాంధీ ఈడీకి సమాచారం ఇచ్చారు. దీనిపై ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. విచారణను వాయిదా వేశారు.

ఇప్పుడు మళ్లీ సమన్లను అందుకున్నారు. ఈ పరిణామాల మధ్య ఆమె కుమారుడు, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ఆయన విదేశాలకు వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది వ్యక్తిగతమేనని చెబుతున్నాయి. ఈ ఉదయం ఆయన ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారని పేర్కొంటోన్నాయి. ఈ నెల 17వ తేదీన ఆయన మళ్లీ ఢిల్లీకి చేరుకుంటారని స్పష్టం చేశాయి. ఆయన ఏ దేశానికి వెళ్లారనే ఇంకా తెలియరాలేదు.
ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. అదే రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి. విదేశీ పర్యటనను ముగించుకుని రాహుల్ గాంధీ ఢిల్లీకి చేరుకున్న రోజే పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యే అవకాశాలు లేకపోలేదు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ఎంపీలతో చర్చిస్తారు.












Click it and Unblock the Notifications