కాంగ్రెస్ నాయకత్వం దేవుడిచ్చిన హక్కు కాదు: రాహుల్ని టార్గెట్ చేసిన ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, యూపీఏపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రాహుల్ గాంధీపై నేరుగా విమర్శలు చేయడం దుమారం రేపుతోంది. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతానికిపైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, నాయకత్వం ఓ వ్యక్తి దైవిక హక్కు కాదంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ కీలకమే. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి మాత్రమే దైవిక హక్కు కాదు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకుందాం అంటూ రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా విమర్శలు చేశారు
కాగా, కొన్ని నెలల క్రితం కాంగ్రెస్లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్ (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్లు కొందరు దీనిని వ్యతిరేకించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై వరుస విమర్శలు చేస్తున్నారు.
మమతా బెనర్జీ మాదిరిగా కాంగ్రెస్ నాయకత్వంపై కిశోర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ప్రశాంత్ కిషోర్ కామెంట్స్పై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఆయన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా.. పీకేను సైద్ధాంతిక నిబద్ధత లేని వ్యక్తిగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో పార్టీలకు ఆయన ఉచితంగా సలహాలు ఇవ్వొచ్చు కానీ.. మన రాజకీయాల అజెండాను ఆయన నిర్దేశించలేరని ఖేరా చురకలంటించారు.
కాగా, బుధావరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన అనంతరం మమతా బెనర్జీ యూపీఏపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో యూపీఏ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం యూపీఏ ఛైర్ పర్సన్గా సోనియా గాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
శరద్ పవార్తో రాజకీయ అంశాలు చర్చించానని.. పవార్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవించానని చెప్పుకొచ్చారు. కేంద్రంలో 2014కు ముందు రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఇప్పుడు మనుగడలో లేదని కాంగ్రెస్ లక్ష్యంగా మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని, దానిపై ఎవరూ పోరాడటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యామ్నాయానికి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు.