కేంద్రంపై ముప్పేట దాడి: వీధి పోరాటాలకు కాంగ్రెస్: ప్రధాని మోదీ నివాసం ముట్టడికి యత్నం
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాల నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమానికి విపక్షాల మద్దతు లభించడంతో ఈ సెగ రోజురోజుకూ రాజుకుంటోంది. తీవ్రరూపాన్ని దాల్చుతోంది. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగాలంటే ప్రభుత్వం నీట్ పై చర్చకు అంగీకరించక తప్పని పరిస్థితి నెలకొంది.
ఈ లాఠీఛార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రోడ్డెక్కారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ఇతర ఎంపీలు ప్రధానమంత్రి అధికారిక నివాసం ఉండే లోక్ కల్యాణ్ మార్గ్ ముట్టడికి యత్నించింది. ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న నీట్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. పార్లమెంట్ వేదికగా ఈ అంశంపై చర్చ జరగాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరానని, దీనిపై చర్చించడానికి అంగీకరించట్లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి పార్లమెంట్ లో దేశ భవిష్యత్ అయిన యువత సమస్యలపై చర్చించడానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలని స్పీకర్ చెప్పడం విచారకరమని, ఇది పూర్తిగా పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు.
ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమానికి ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారు. లాఠీ ఛార్జీలో గాయపడి అక్కడ చికిత్స పొందుతోన్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిన నేతలు.. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్లే నేడు దేశంలో యువత వీధుల్లోకి వచ్చి పోరాడాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
మరోవంక కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి, విచక్షణారహితంగా లాఠీలతో దాడి చేశారు. ఈ దమనకాండలో ఎంతోమందికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థుల గొంతు నొక్కేలా కేంద్రం పోలీసు బలగాలను ప్రయోగించడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications