దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మహాపాదయాత్ర
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా మహాపాదయాత్ర చేపట్టబోతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తాన్ని ఈ పాదయాత్ర కవర్ చేయబోతోంది. ప్రజలకు చేరువవడమే ఈ యాత్ర లక్ష్యం.
రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప చింతన శిబిరం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మేథోమధనంలో భాగంగా భారీగా పాదయాత్ర నిర్వహించాలని ఒక కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. నిరుద్యోగ సమస్యను లేవనెత్తేలా ఈ యాత్ర ఉండాలని ప్రతిపాదించిన కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
ఏడాదిపాటు జరిగే ఈ మహాపాదయాత్రలో రాహుల్ గాంధీతోపాటు పార్టీ సీనియర్ నేతలు కూడా మధ్య మధ్యలో చేరాలని సూచించారు. ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ పాదయాత్రకు సంబంధించి పూర్తిస్థాయిలో ఒక ప్రజలంటేషన్ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై పార్టీ అగ్రనేతలు లోతైన చర్చ కూడా జరిపారని, దాదాపుగా ఈ యాత్ర ఖాయమవుతుందని చెబుతున్నారు.
ఇటువంటి ప్రతిపాదననే కాంగ్రెస్ యూత్ కమిటీ కూడా ఇచ్చినట్లు సమాచారం. పాదయాత్రలో భాగంగా అవసరమైన చోట్ల జనతా దర్బార్ పేరుతో భారీ బహిరంగసభలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వివిధ కమిటీలు వివిధ అంశాలపై తమ ప్రజంటేషన్లను సోనియాగాంధీకి సమర్పించాయి.