జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు : చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి అనిత పరామర్శ !!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 11 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి వెళ్లి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
కాగా గ్రామానికి చేరుకున్న మంత్రి అనిత ముందుగా చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం, పోలీసులు చిన్నారిని క్షేమంగా గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని భరోసా ఇచ్చారు. కుమార్తె జాడ కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదనను ఆమె ఓపిగ్గా విన్నారు. చిన్నారి ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చర్యలు చేపడుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసును వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి ఇప్పటి వరకు చేపట్టిన గాలింపు చర్యలు, దర్యాప్తు పురోగతి, సేకరించిన ఆధారాలపై ఎస్పీ వివరించారు. ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, గ్రామ పరిసర ప్రాంతాలు, చెరువులు, కాలువలు, పొదలు, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
అనంతరం చిన్నారి అదృశ్యమైన ప్రదేశాన్ని మంత్రి స్వయంగా సందర్శించి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ అడవి జంతువుల సంచారం ఉందా? ఆ ప్రాంతంలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? అనే అంశాలపై అటవీశాఖ, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ ప్రత్యేక కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తోందని అధికారులు మంత్రికి వివరించారు.
కేవలం గాలింపు చర్యలకే పరిమితం కాకుండా అపహరణ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. అదేవిధంగా సెల్ఫోన్ కాల్ డేటా, లొకేషన్ విశ్లేషణ, సాంకేతిక ఆధారాల సేకరణ కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసును మొదటి రోజు నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జిల్లా ఎస్పీ గారితో స్వయంగా అప్డేట్స్ తెలుసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే నేడు చిన్నారి ఇల్లు మరియు పరిసర ప్రాంతాలను… pic.twitter.com/vfHmrIO2J9
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 17, 2026
మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత.. "చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రభుత్వం అత్యంత సీరియస్గా పని చేస్తోంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. గాలింపు చర్యలతో పాటు అపహరణ, ప్రమాదం, ఇతర అనుమానాస్పద అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే మా ప్రధాన లక్ష్యం" అని తెలిపారు. అటవీశాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖతో పాటు ఇతర విభాగాల సమన్వయంతో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని ఆమె వెల్లడించారు. గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గాలింపు మరింత విస్తరించామని చెప్పారు. అవసరమైతే మరిన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications