Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల - 5 కీలక గ్యారంటీలు..!
జాతీయ స్ధాయిలో ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ ఇవాళ తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం 48 పేజీలతో విడుదల చేసిన మ్యానిఫెస్టోకు న్యాయ్ పత్ర అని పేరు పెట్టారు. ఇందులో ప్రధానంగా ఐదు కీలక గ్యారంటీలు ఉన్నాయి. ఇందులో మళ్లీ ఒక్కో గ్యారంటీల్లో విడివిడిగా హామీలున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలు దీన్ని విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఐదు న్యాయాల్ని అమలు చేస్తామన్నారు. ఇందులో యువన్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ అమలు చేస్తామని హమీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగం, కులగణనను ప్రస్తావించారు. ఈసారి కాగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో కులాల సర్వే చేపడతామని, తద్వారా ఆయా కులాల ఆర్ధిక స్ధితిగతులు తెలుసుకుని, వారికి న్యాయం చేస్తామని తెలిపారు.
ఉద్యోగాలు:
దేశంలో కొత్త అప్రెంటిస్షిప్ హక్కు తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రతి డిప్లొమా హోల్డర్కు ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ రంగంలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ హామీ ఇచ్చింది. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కళాశాల గ్రాడ్యుయేట్లకు అప్రెంటిస్ షిప్ లో భాగంగా సంవత్సరానికి లక్ష ఇస్తామని తెలిపింది. మార్చి 15 వరకూ ఉన్న విద్యారుణాల్ని కూడా మాఫీ చేస్తామని తెలిపింది.
ఆరోగ్యం:
దేశంలో ప్రతీ ఒక్కరికీ రూ.25 లక్షల వరకూ క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా టీకాల పంపిణీకి ఓ ప్రత్యేక మిషన్ తెస్తామని, దీని ద్వారా ఐదేళ్లలోపు వందశాతం చిన్నారులకు వ్యాక్సిన్లు అందేలా చూస్తామని తెలిపింది. కేంద్రం ఇస్తున్న సామాజిక పెన్షన్లను వెయ్యి రూపాయలకు పెంచుతామని తెలిపింది. సీనియర్ సిటిజన్లలకు బస్సులు, రైళ్లలో రాయితీలు పునరుద్దరిస్తామని మరో హామీ ఇచ్చింది. బ్రెయిలీని కూడా భాషగా గుర్తిస్తామని హామీ ఇచ్చింది.
రిజర్వేషన్లు:
అలాగే రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్ కులాలు, జాతులు, వెనుకబడిన వర్గాలకు అమలు చేస్తున్న రిజరేషన్లకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి ఎత్తేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అన్ని కులాలు, వర్గాలకు అమలు చేస్తామని మరో హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల విధానం తీసేసి అన్ని ఉద్యోగాల్ని క్రమబద్ధీకరిస్తామని కూడా తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల నిర్మాణం, వ్యాపారాల కోసం ఇస్తున్న క్రెడిట్ ను పెంచుతామని తెలిపింది.
భూ పరిమితి చట్టాల ప్రకారం పేదలకు ప్రభుత్వ భూమి, మిగులు భూముల పంపిణీని పర్యవేక్షించడానికి ఓ అథారిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన కాంట్రాక్టర్లకు మరిన్ని పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు ఇవ్వడానికి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ పరిధిని విస్తరిస్తామని ప్రకటించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ల నిధులు రెట్టింపు చేస్తామని తెలిపింది.
పేదలకు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల,షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థుల కోసం కాంగ్రెస్ రెసిడెన్షియల్ పాఠశాలల నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వాటిని ప్రతి బ్లాక్కు విస్తరిస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16, 25, 26, 28, 29, 30 ప్రకారం మతపరమైన మైనారిటీలకు హామీ ఇచ్చిన హక్కులను, మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కును పార్టీ గౌరవిస్తుందని, సమర్థిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16, 29 మరియు 30 కింద హామీ ఇచ్చిన భాషా మైనారిటీల హక్కులను కూడా గౌరవిస్తుంది, సమర్థిస్తుందని పేర్కొంది.
విద్య, ఉపాధి, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు, ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువతనుప్రోత్సహిస్తుంది. సహాయం చేస్తుంది. విదేశాల్లో చదువుకోవడానికి మౌలానా ఆజాద్ స్కాలర్షిప్లను పార్టీ పునరుద్ధరిస్తుంద. స్కాలర్షిప్ల సంఖ్యను పెంచుతుంది. పక్షపాతం లేకుండా మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలను అందజేసేలా పార్టీ హామీ ఇస్తుంది.
విద్య, వైద్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో వివక్ష లేకుండా మైనారిటీలు తమ న్యాయమైన వాటాను పొందేలా చూస్తామని తెలిపింది.మైనారిటీలకు దుస్తులు, ఆహారం, భాష మరియు వ్యక్తిగత చట్టాల ఎంపిక స్వేచ్ఛను ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత చట్టాల సంస్కరణను పార్టీ ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో మరిన్ని భాషలను చేర్చాలన్న దీర్ఘకాలిక డిమాండ్లను పార్టీ నెరవేరుస్తుంది.












Click it and Unblock the Notifications