ప్రపంచ పర్యాటక దినోత్సవం: మోడీ ఫోటోలను పోస్ట్ చేసిన కాంగ్రెస్..ఎందుకలాగా?
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలే లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో పోస్టు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు చాలా విదేశీ పర్యటనలు చేశారని విమర్శించింది. మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి 18 ఫోటోలతో కూడిన ఫ్రేమ్ను తయారు చేసి ట్విటర్లో పోస్టు చేసింది కాంగ్రెస్.
ఇక కాంగ్రెస్ పోస్టు చేసిన ఫోటో ఫ్రేమ్లో ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల సందర్భంగా ఎయిరిండియా విమానం ఎక్కే సమయంలో కింద ఉన్న వారికి చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు హ్యాపీ వరల్డ్ టూరిజం డే అంటూ చిన్న సందేశం కూడా ఉంచింది కాంగ్రెస్ పార్టీ.
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం. దీన్ని ఐక్యరాజ్యసమితి బాధ్యతగా తీసుకుని ఏటా పర్యాటకరంగంను ప్రమోట్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పోస్టు చేసిన ఫోటోల్లో ప్రధాని నరేంద్రమోడీ కొందరికి నమస్కారం చేసే ఫోటోలు ఉండగా.. గత కొన్నేళ్లలో నరేంద్ర మోడీ చేపట్టిన విదేశీ టూర్లకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఫోటోల్లో సూట్ ధరించినట్లుగా ఉండగా ఇంకొన్ని ఫోటోల్లో ఆయా దేశ సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నట్లుగా ఉన్నాయి.
Happy #WorldTourismDay ✈️ pic.twitter.com/pPrRm9xOOn
— Congress (@INCIndia) September 27, 2019
2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం 57 దేశాల్లో పర్యటించి 92 ట్రిప్పులు వేశారు. ఐదేళ్లలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన పర్యటనల కంటే రెట్టింపు సంఖ్యలో మోడీ పర్యటనలు ఉన్నాయి. 2014 మే లో తొలిసారిగా మోడీ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 2018 నాటికి ఆయన చార్టర్డ్ విమానాల ఖర్చు, ఎయిర్క్రాఫ్ట్ మెయిన్టెనెన్స్, విదేశీ పర్యటనల్లో ఉండగా హాట్లైన్ సదుపాయాలకు మొత్తం అయిన ఖర్చు రూ.2,021 కోట్లుగా ఉందని గత డిసెంబర్లో కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో తెలిపారు. అదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా 2009 నుంచి 2014లో ఉన్న సమయంలో ఈ ఖర్చలు రూ. 1,346గా ఉన్నట్లు ప్రభుత్వం రాజ్యసభకు వివరించింది.