జమిలిపై కేంద్రం కీలక నిర్ణయం - కౌంట్ డౌన్..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణ పై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు పార్టీలు అనేక అంశాలు ప్రస్తావించాయి. ఆదానీ ముడుపుల వ్యవహారం పై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మణిపూర్ అంశాన్ని ప్రస్తావించింది. ఈ సమావేశాల్లోనే కేంద్రం ఒన్ నేషన్ - ఒన్ ఎలక్షన్ తో పాటుగా వక్ఫ్ సవరణ బిల్లుకు సిద్దమవుతోంది. ఈ బిల్లు ఆమోదం ద్వారా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల ప్రక్రియ కు కౌంట్ డౌన్ మొదలవుతుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల పై కేంద్రం నిర్వహించిన అఖిల పక్షం లో హాట్ డిబేట్ జరిగింది. సమావేశాల్లో ఆదానీ ముడుపుల వ్యవహారం పైన చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో పాటుగా మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ సవరణ బిల్లు, చైనా సరిహద్దు అంశం సహా ప్రజా సమస్యలను అఖిలపక్షంలో విపక్షాలు లేవనెత్తాయి. అన్ని అంశాల పైన ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు స్పష్టం చేసారు. కీలక బిల్లుల ఆమోదానికి సహకారం అందించాలని మంత్రులు కోరారు. ఇక, రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలపై అఖిల పక్షంలో చర్చ జరిగింది.

ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తేదీ నుంచి డిసెంబరు 20 వరకు జరుగను న్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ఒక దేశం-ఒకే ఎన్నిక బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సంకేతాలు ఇస్తోంది. ఈ బిల్లులను ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు. సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఇక, ఏపీ నుంచి టీడీపీ సభ్యులు రాష్ట్రంలో విభజన అంశాల పైన చర్చించాలని కోరారు. పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని సూచించారు.
ప్రకృతి వైపరీత్యాలు, నదుల అనుసంధానం పై చర్చ జరగాలని టీడీపీ కోరింది.
వక్ఫ్ సవరణ బిల్లు పై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ వారంలో పార్లమెంట్ కు నివేదిక ఇవ్వనుంది. వైసీపీ ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. బిల్లుపైన తాను ఇప్పటికే కేంద్రంతో చర్చించానని..అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు సూచించారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించామని లోక్సభ జనసేన ఫ్లోర్ లీడర్ బాలశౌరి తెలిపారు. విభజన సమస్యలను వేగంగా పరిష్కరించాలని ప్రస్తావించానని అన్నారు. విభజన హామీల మేరకు, ఆయిల్ రిఫైనరీ, కడప స్టీల్ ప్లాంట్. ఓడ రేవు కూడా ఏపీకి ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications