15 ఏళ్ల బాలికపై పదే పదే రేప్: కాంగ్రెసు కార్యకర్తపై కేసు
బూందీ: రాజస్థాన్లో 15 ఏళ్ల బాలికపై పదే పదే అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు స్థానిక కాంగ్రెసు కార్యకర్తపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజస్థాన్లోని బూందీలో చోటు చేసుకుంది. హెన్హెచ్ఓ భగవతీ ప్రసాద్ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం - అబ్దుల్ సలాం (45) అనే వ్యక్తి పదిహేనేళ్ల వయసు గల బాలికను బెదిరించి ఆమెపై పదే పదే అత్యాచారం చేశాడు.
నిందితుడు గతంలో లఖేరీ మున్సిపల్ బోర్డు పరిధిలో వార్డు సభ్యుడిగా కూడా పని చేశాడు. తన ఇద్దరు సోదరులతో కలిసి లఖేరీలో ఉంటున్న బాలిక ఇంటికి తరుచుగా వస్తూ ఆమెను వేధించేవాడు. ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని బెదిరించేవాడు.
విషయం తెలుసుకున్న బాలిక సోదరులు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెండు సార్లు తనపై సలాం అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది.
బాధితురాలు తన ఇద్దరు సోదరులతో కలిసి లఖేరీలో నివసిస్తోంది. తాను పడుతున్న బాధను ఓ సోదరుడికి బాధితురాలు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.