కొత్త స్కీం.. యువ నిధి: నిరుద్యోగులకు రూ.3,000, డిప్లొమా హోల్డర్లకు రూ.1,500
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇవ్వాళ కర్ణాటకలో పర్యటించారు. బెళగావిలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల హామీలను ప్రకటించారు.
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందిక్కడ. మే 12వ తేదీన పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తోన్నాయి. జిల్లాల్లో పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకలో పర్యటించారు. రెండువారాల వ్యవధిలో రెండుసార్లు వేర్వేరు జిల్లాలను సందర్శించారాయన. ఇప్పుడు తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించారు. బెళగావిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ- కొత్త హామీని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువ నిధి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని అన్నారు. ఈ పథకం కింద నిరుద్యోగ యువకులకు ప్రతినెలా 3,000 రూపాయలు, డిప్లొమా గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధానమైన హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. గృహజ్యోతి కింద గృహావసర విద్యుత్ వినియోగంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. గృహ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే- బీపీఎల్ కుటుంబంలోని ప్రతి మహిళకు 10 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని తెలిపింది.

నిరంతరం ఉద్యోగాలను నియమించుకునే రైల్వే వంటి శాఖల్లో కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయట్లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలను సృష్టిస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లను లాక్కుంటోందని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.












Click it and Unblock the Notifications