అర్ధరాత్రి కేంద్రం సంచలనం: అప్పటివరకు మహిళా రిజర్వేషన్లు వర్తించవ్.. !!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతూ వస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు సుదీర్ఘంగా పార్లమెంట్ లో చర్చ అనంతరం దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని వెలువడించింది. దీంతో- మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన చట్టంపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. కొన్ని సవరణలు ఇందులో చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ బిల్లు చట్టరూపాన్ని దాల్చింది. ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసింది. చట్ట సవరణలపై చర్చ జరుగుతుండగానే, దీన్ని అమలులోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ ఎందుకు జారీ చేశారనేది స్పష్టం కాలేదు. దీనికి సాంకేతిక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చట్టం అమలైనప్పటికీ ప్రస్తుత లోక్సభలో మహిళలకు తక్షణ లాభం కలగదు. తదుపరి జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఈ రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు పేర్కొంటోన్నారు.

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం- రాజ్యాంగ (106వ సవరణ) చట్టం, 2023 నిబంధనలు ఏప్రిల్ 16, 2026 నుండి అమలవుతాయి. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం.. లోక్సభ, శాసనసభల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళల కోసం రిజర్వ్ చేస్తుంది. 2027 జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. ప్రస్తుతం చర్చలో ఉన్న బిల్లులు 2029 నుండి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్రం ఉద్దేశం.
అంతకుముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. దీనికి మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరినీ కోరారని, ఎటువంటి గందరగోళానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం అందరి బాధ్యత అని, దీనికి ప్రభుత్వం క్రెడిట్ కోరట్లేదని చెప్పారు.
ప్రతిపక్షాల వాదనలను రిజిజు తోసిపుచ్చారు. ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడిందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మూడుసార్లు లేఖలు రాశామని గుర్తు చేశారు. అలాగే టీఎంసీ, డీఎంకే, ఎస్పీ నాయకులను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరానని ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న భయాందోళనలను హోమ్ మంత్రి అమిత్ షా కూడా నివృత్తి చేశారు. దీనికి సంబంధించిన డేటా ఆధారంగా ఆయన సభలో మాట్లాడారు. ఎవరైనా దీనికి వ్యతిరేకిస్తే, అది రాజకీయం చేయడమేనని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications