అగ్గిరాజుకుంటుందా..ఒకప్పుడు నమాజ్ జరిగే చోట గోవర్ధన పూజ: కపిల్ మిశ్రా హాజరు
వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా శుక్రవారం రోజున గోవర్ధన్ పూజకు హాజరయ్యారు. అయితే ఒక వ్యక్తి గోవర్ధన పూజకు హాజరవడంలో పెద్దగా చెప్పుకోవాల్సిందేముంది అని మీకు డౌటు రావొచ్చు. కానీ ఈ గోవర్ధన పూజకు కపిల్ మిశ్రా హాజరయ్యారు కాబట్టి ఇది కచ్చితంగా పెద్ద వార్తే అవుతుంది. ఎందుకంటే ఈ గోవర్థన పూజ జరిగిన చోట ఒకప్పుడు క్రమం తప్పకుండా నమాజ్ జరిగేది. గుర్గావ్లోని సెక్టార్ 12ఏలో ప్రతి శుక్రవారం పోలీసుల పహార మధ్య నమాజ్ జరుగుతుండేది. కానీ ఈ శుక్రవారం రోజు మాత్రం గోవర్ధన పూజ జరిగింది. దీంతో ఇది హాట్ టాపిక్గా మారింది.
గుర్గావ్ సెక్టార్ 12 ఏలో నమాజ్ జరుగుతున్న వేళ సంయుక్త హిందూ సంఘర్ష్ సమితి అనే హిందూ సంస్థకు చెందిన వ్యక్తులు ఆటంక పరిచేవారు. దీంతో పోలీసుల నీడలో నమాజ్ జరిగేది. దాదాపుగా రెండు వారాల పాటు ఈ చర్య కొనసాగింది. గత నెలలో హిందూ సంస్థకు చెందిన 26 మంది నిరసనకారులు నమాజ్ చేస్తున్న సమయంలో వచ్చి ఆందోళనలు నిర్వహించి నమాజ్కు ఆటంకం కలిగించారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదంతో పాటు ఘర్షణ వాతావరణం కూడా చోటుచేసుకుంది. ఘర్షణ చిలికి చిలికి పెద్ద గాలివానగా మారుతుందని గ్రహించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి 26 మంది హిందూ సంస్థకు చెందిన నిరసనకారులను అరెస్టు చేశారు. అదే రోజున ఆ 26 మందికి బెయిల్ మంజూరు అయ్యింది.

ఇక ఆదివారం రోజున సంయుక్త హిందూ సంఘర్ష్ సమితి ఓ సంచలన ప్రకటన చేసింది. నమాజ్ను వ్యతిరేకిస్తూ అన్ని బహిరంగ ప్రదేశాల్లో గోవర్ధన పూజ నిర్వహిస్తామంటూ ప్రకటన చేశారు. దీంతో హిందూ - ముస్లింల గొడవ మళ్లీ రాజుకుంటుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ముస్లిం మత పెద్దలు ఓ విన్నపం చేశారు. తమకు నమాజ్ చేసుకునేందుకు మరో చోటు చూపిస్తే అక్కడికి వెళ్లి నమాజ్ చేసుకుంటామని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అదే సమయంలో వక్ఫ్ బోర్డు పరిధిలోకి వచ్చే స్థలాలు కబ్జా అయ్యాయని వాటిని విడిపించాలని కూడా కోరారు. అ నిబంధనకు ఒప్పుకుంటే తాము నమాజ్ చేస్తున్న ప్రస్తుత ప్రాంతంను వీడి వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు.
ఇదిలా ఉంటే.. గురువారం రోజున నమాజ్ జరిగే ఎనిమిది ప్రాంతాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు గుర్గావ్ స్థానిక పాలకవర్గం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న అనుమతులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. స్థానికులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అందిన ఫిర్యాదు మేరకే అధికారులు నమాజ్కు అనుమతి నిరాకరించారని పోలీసులు తెలిపారు. అయితే భవిష్యత్తులో నమాజ్కు ఆటంకం కలగకుండా...మరో చోటు ఏర్పాటు చేసేందుకు ఇటు హిందు వర్గం అటు ముస్లిం వర్గం నుంచే కాకుండా సామాజిక సంస్థల నుంచి కూడా సభ్యులను ఎంపిక చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఏ ప్రాంతమైతే నమాజ్ చేసేందుకు అణువుగా ఉంటుందో ఈ కమిటీ గుర్తిస్తుంది. కమిటీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు వీలు అవుతుందని గుర్గావ్ స్థానిక అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications