మహిళలు ఆ జీన్స్ ధరించి సమాజానికి ఏం సందేశమిస్తున్నట్లు... ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు...
మహిళలు రిప్డ్ జీన్స్(చిరిగిన జీన్స్) ధరించి సమాజానికి ఏం సందేశిస్తున్నట్లు అని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించారు. బుధవారం(మార్చి 17) ఉత్తరాఖండ్ స్టేట్ కమిషన్ ఫైర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ఓ వర్క్షాప్ కార్యక్రమంలో సీఎం తీరత్ మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళల వస్త్రధారణపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'ఓ ఎన్జీవోను నడుపుతున్న మహిళ రిప్డ్ జీన్స్ ధరించడం చూసి నేను షాకయ్యా. ఇదే వేషధారణలో ప్రజా సమస్యల పరిష్కారానికి వెళ్లి సమాజానికి,చిన్నారులకు వారు ఏం సందేశం ఇస్తున్నట్లు...? ఇదంతా ఇంటి నుంచే మొదలవుతుంది... మనమేం చేస్తామో... మన పిల్లలూ అదే చేస్తారు. కాబట్టి ఒక చిన్నారికి చిన్నతనంలోనే ఇంటి వద్ద సరైన సంస్కృతి నేర్పిస్తే... వాళ్లెంత ఆధునికంగా మారినా సరే... జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు...' అని సీఎం తీరత్ వ్యాఖ్యానించారు.
చిన్నారులు తమ మోకాళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం తనకు నచ్చదన్నారు. ఓవైపు ప్రపంచమంతా భారత్ నుంచి యోగా నేర్చుకుని.. శరీరమంతా నిండైన దుస్తులు ధరిస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరిగెడుతున్నామని అన్నారు. 'మోకాళ్లు కనిపించేలా రిప్డ్ జీన్స్ ధరించడం... సంపన్నుల పిల్లల్లా కనిపించడం... ఇవీ ఇప్పటి చిన్నారులకు మనం నేర్పిస్తున్న విలువలు. ఇదంతా ఎక్కడినుంచి వస్తోంది. లోపం స్కూళ్లదా టీచర్లదా?.. చిరిగిన జీన్స్లో మోకాళ్లు కనిపించేలా నేను నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నట్లు... బాలికలేమీ తక్కువ కాదు... వాళ్లు కూడా మోకాళ్లు కనిపించేలా రిప్డ్ జీన్స్ ధరిస్తున్నారు. ఇది మనకు మంచిదా...?' అని ప్రశ్నించారు.
ఇదే కార్యక్రమంలో మంత్రి గణేశ్ జోషి మాట్లాడుతూ... ఇంటి వద్ద మహిళలు చిన్నారులకు అన్ని విషయాలు చెప్పాలన్నారు. జీవితంలో ఎలా నడుచుకోవాలో వారికి చెప్పాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాన్ని,చిన్నారులను చూసుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ముఖ్యమంత్రి తీరత్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. విభజన రాజకీయాలతో బీజేపీ ఈ సమాజాన్ని విఛ్చిన్నం చేస్తే ఫర్వాలేదు... కానీ మహిళలు రిప్డ్ జీన్స్ ధరిస్తే మాత్రం ఈ సంస్కృతికి,సమాజం నాశనమవుతుంది... క్యా బాత్ హై... తీరత్ వ్యాఖ్యలను బీజేపీ సమర్థిస్తుందా.. అంటూ యూత్ కాంగ్రెస్ లీడర్ సంజయ్ ఝా ప్రశ్నించారు. మొత్తానికి కొత్త సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.