మదర్ థెరిస్సా సేవలు: 'క్రైస్తవ మత మార్పిడి కోసమే', ఆమెను వివాదాల్లోకి లాగొద్దని కేజ్రీ
భరత్ పూర్: నిరుపేదలకు మదర్ థెరిస్సా సేవ అందించడం వెనుకున్న ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్ థెరిస్సా సేవలు మంచిదే. కానీ వ్యక్తులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికి సేవను ఆధారంగా చేసుకున్నారు అని భగవత్ అన్నారు.
రాజస్థాన్లోని భరత్పూర్లో జరిగిన ఎన్జీఓ అప్నా ఘర్ నియర్ హియర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడి ప్రశ్నే కాదని, కానీ సేవ పేరుతో మార్పిడికి పాల్పడటమే అభ్యంతరకరమని అన్నారు.
దేశంలోని పేదలను సేవల ద్వారా మత మార్పిడికి పాల్పడటం వల్ల ఆమె అందించిన సేవకు విలువ లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్జీఓలు మాత్రం ఇక్కడ పేద, నిస్సహాయులైన ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ సేవలు మదర్ థెరిస్సా మాదిరిగా ఉండవని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై మిగతా పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. మదర్ థెరిస్సా సేవలపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబధ్దం అంటూ కాంగ్రెస్ కొట్టి పారేసింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ మదర్ థెరిస్సా సేవలు ప్రపంచానికే ఆదర్శప్రాయమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మదర్ థెరిస్సా చాలా గొప్ప వ్యక్తి, ఆమెపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.
మదర్ థెరీసాను వివాదాల్లోకి లాగొద్దని, ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేయాలని కోరారు. తాను కోల్కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో థెరీసాతో కలిసి కొంతకాలం పనిచేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు.
అలాగే, సీపీఎం కూడా భగవత్ వ్యాఖ్యల విషయం స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచంలో భారత్ కు ఉన్న గొప్ప ఇమేజ్ తగ్గుతుందని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసి భగవత్ కొత్తగా ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని పేర్కొంది.
ఢిల్లీ కేథలిక్ అర్కడైయాసిస్ ఫాధర్ సవారిముత్తు ఈ విషయంపై మాట్లాడుతూ మదర్ థెరీసాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆమె జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications