కేసు క్లోజ్: బిజెపి ఢిల్లీ సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ?
న్యూఢిల్లీ: మాజీ పోలీసాఫీసర్ కిరణ్ బేడీపై ఉన్న చీటింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. దాంతో ఆమె బిజెపిలో చేరుతారనే ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేసిన కిరణ్ బేడీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని హర్షించారు.
కిరణ్ బేడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న సమయంలో 2011 నవంబర్లో కిరణ్ బేడీపై కేసు నమోదు చేశారు. తన ట్రస్టులు ఇండియా విజన్ ఫౌండేషన్, నవజ్యోతి ఫౌండేషన్లకు మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని కిరణ్ బేడీపై కేసు నమోదైంది.
పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆమె ఒక్కొక్కటి 20 వేల రూపాయల ఖరీదు చేసే కంప్యూటర్లను 50 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారనే ఆరోపణ కూడా వచ్చింది. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అప్పట్లో సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాము మైక్రోసాఫ్ట్ నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, బేడీ ఏ విధమైన దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పిందని పోలీసులు తమ క్లోజర్ రిపోర్టులో తెలిపారు. అక్టోబర్ 28వ తేదీన పోలీసులు ఆ క్లోజర్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. పోలీసు శిక్షణా కళాశాల నుంచి ఆడిట్ నివేదిక ప్రతిని కూడా దర్యాప్తు అధికారి సమర్పించారు. కంప్యూటర్ కొనుగోళ్లలో అవకతవకలు లేవని ఆ నివేదిక తేల్చింది. ఈ క్లోజర్ నివేదిక కోర్టు మందు ఈ నెలాఖరులో వస్తుంది.