పోలీస్ లాకప్లో మూడు రోజులు గ్యాంగ్ రేప్
చెన్నై: రక్షణ కల్పించవలసిన పోలీసులే మహిళను లాకప్ లో నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేశారు. అందుకు పోలీసులు చివరికి కటకటాలపాలైనారు. మూడు రోజుల పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.
సీబీఐ అధికారులు రంగంలోకి దిగి ఓ సబ్ ఇన్స్ పెక్టర్ తో పాటు ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. నలుగురు కానిస్టేబుల్స్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తమిళనాడులోని తిరువూరు జిల్లా ఉడుమలైపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఓ హత్య కేసులో ఉడుమలైపేట పోలీసులు 2014 ఆగస్టు 11వ తేదిన 50 సంవత్సరాల మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అయితే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచలేదు. లాకప్ లో నిర్బంధించారు.
తరువాత ఆమె మీద వరుసగా పోలీసులు గ్యాంగ్ రేప్ చేశారు. మూడు రోజుల పాటు ఆమెపై లాకప్ లోనే సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఆమె తన కుమార్తె సహాయంతో మద్రాసు హై కోర్టులో పిటీషన్ వేసి న్యాయం చెయ్యాలని మనవి చేసింది.
పోలీసుల పైచాచికత్వాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. మహిళకు తక్షణం రూ. రెండు లక్షలు ఆర్థిక సహాయం చెయ్యాలని మద్రాసు హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అదే విధంగా కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 80 మంది పోలీసులను మహిళ ముందు హాజరుపరిచారు.
బాధితురాలు సబ్ ఇన్స్ పెక్టర్ కే. విజయ్ కుమార్ (33), కానిస్టేబుల్స్ ఎస్. తిలక్ కుమార్ (29), ఎస్. రంగనాయగమ్ (32) అనే ముగ్గురు తన మీద సామూహిక అత్యాచారం చేశారని గుర్తు పట్టింది. అదే విధంగా మరో నలుగురు పోలీసుల మీద అనుమానం వ్యక్తం చేసింది.
సీబీఐ అధికారులు సబ్ ఇన్స్ పెక్టర్ విజయ్ కుమార్, క్రిష్ణగిరి జిల్లా తళి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం పని చేస్తున్న తిలక్ కుమార్, రంగనాయగమ్ ను అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.