రాష్ట్రపతిభవన్లో కరోనా పాజిటివ్ కేసు: 125 కుటుంబాలు క్వారంటైన్లోకి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్తున్న కరోనావైరస్ మహమ్మారి రాష్ట్రపతి భవన్కు పాకింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. రాష్ట్రపతి భవన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుని బంధువుకు పాజిటివ్ అని తేలింది. అతని తల్లి కూడా ఇప్పటికే కరోనాతో మరణించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కార్మికుని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. ఇంటి సభ్యులను శనివారం నుంచి క్వారంటైన్ కు పంపించారు. కార్మికుని ఇంటికి సమీపంలోని 30 ఉద్యోగుల కుటుంబాలను కూడా అధికారులు క్వారంటైన్ చేశారు. ప్రభుత్వమే వారికి ఆహారం సరఫరా చేస్తోంది.

తాజాగా, మరో 95 కుటుంబాలను కూడా క్వారంటైన్ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులతోపాటు కుటుంబంలోని ఎవరినీ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ 125 కుటుంబాల నుంచి 500 మందిని సెల్ఫ్ ఐసోలేషన్ ఉంచినట్లు తెలిసింది.
ఇప్పటికే ఢిల్లీలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 2081కి చేరింది. మొత్తం సుమారు 50 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా 18500లకుపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 590 మందికిపైగా మరణించారు.
Recommended Video
కాగా, కరోనా కేసులు రెట్టింపు అవడానికి పడుతున్న వేగం భారతదేశంలో నెమ్మదించిందని, లాక్డౌన్కు ముందు 3.4 రోజులకోసారి కేసులు రెట్టింపు కాగా, ప్రస్తుతం అది 7.5 రోజులకు చేరిందని వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి కేసుల రెట్టింపు వేగం తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. కేరళ, కర్ణాటకలో ఈ రెట్టింపు వేగం బాగా తగ్గిందని తెలిపారు.












Click it and Unblock the Notifications