ఇండియాను భయపెడుతోందా? భయపడుతోందా?
చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో భారతదేశం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైద్యరంగం ఎంత సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, హాంకాంగ్ తదితర దేశాల్లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో అక్కడి నుంచి వచ్చిన వారికి ఆర్టీ -పీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తోంది.
క్రిస్మస్ సందర్భంగా హిమాచల్ప్రదేశ్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు విధించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మన్కీ బాత్లో ఆయన మాట్లాడారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇటువంటి తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండటం అవసరమని, మాస్కులు ధరించడంతోపాటు తరుచుగా చేతుల్ని శుభ్రం చేసుకుందాం అని పిలుపునిచ్చారు. వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తమ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తెలిపారు. కరోనా పరీక్షలు చేయడంతో పాటు టీకాలు సరఫరా చేస్తున్నామని, రాష్ట్రంలో రోజూ 45 వేల నుంచి 50 వేల టెస్టులు చేస్తున్నట్టు వెల్లడించారు.