మహారాష్ట్రలో కరోనా విజృంభణ ... రికార్డు స్థాయిలో .. పోలీస్ శాఖలో కేసుల లెక్కలివే !!
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మహా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తోంది .మహారాష్ట్ర లో ఇప్పటివరకు 5,48,313 కేసులు నమోదు కాగా, 1,47,513 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,81,843 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా , అత్యధికంగా 18,650 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 29.1 లక్షల కరోనా టెస్ట్ లు నిర్వహించారు.

నిత్యం 12 వేలను దాటుతున్న కేసులు .. 'మహా'పై కరోనా పంజా
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులలో అత్యధికంగా మహారాష్ట్ర లోనే ఎక్కువ కేసులు ఉండటం, అక్కడి పరిస్థితులను ప్రభుత్వం అదుపులోకి తీసుకురాలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్రలో ప్రతినిత్యం నమోదవుతున్న కేసులు 12వేలను దాటుతున్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో అత్యధికంగా ఇప్పటివరకు 1,26,356 కరోనా కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మహారాష్ట్రలోని జైళ్ళలోనూ , పోలీస్ శాఖలోనూ కరోనా విజృంభణ ఆగటం లేదు.

పోలీస్ శాఖలో కరోనా కల్లోలం .. ఇప్పటివరకు 11, 773 కరోనా కేసులు
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర పోలీసులను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే 11 వేల మందికిపైగా మహారాష్ట్ర పోలీసులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 381 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పటి వరకు మహా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన పోలీసు సిబ్బంది సంఖ్య 11,773 కు చేరుకుంది.

పోలీస్ శాఖలో 2233 యాక్టివ్ కేసులు
వీరిలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న 9,416 మంది సిబ్బంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ వారంతా విధులు నిర్వర్తించడానికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని మాత్రం ఇంకా పొందలేకపోతున్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో 2233 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని మహారాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులే కరోనా బారిన పడుతున్న పరిస్థితులు మహారాష్ట్రలో పరిస్థితి ఏమాత్రం అదుపులో లేదు అని చెప్పడానికి నిదర్శనం.

దేశంలోనూ కరోనా వ్యాప్తి ..67 వేలకు చేరువగా కొత్త కేసులు
మరోపక్క దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గురువారం నాడు కొత్తగా 67 వేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షలకు చేరువైంది. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా టాప్ త్రీ లో ఉంది.












Click it and Unblock the Notifications