కరోనా మరణాలను తగ్గిస్తున్న బీసీజీ వ్యాక్సిన్: అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సంభవిస్తున్న మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్(ట్యూబర్కూలోసిస్ వ్యాక్సిన్-టీబీ వ్యాక్సిన్) ఎంతో సహాయకారిగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే బీసీజీ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని వెల్లడించారు.
అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్, ఇల్లినాయిస్, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్లోని పెర్నాంబుకో, రియోడిజనీరో, సావోపావో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.
ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న కరోలినా బరిల్లాస్ మురి తెలిపారు. అమెరికాతో పోలిస్తే లాటిన్ అమెరికా దేశాల్లో జనసాంద్రత ఎంతో ఎక్కువ అని తెలిపారు. ఇక ఐరోపాలోని జర్మనీలో ఫలితాలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
తూర్పు జర్మనీతో పోలిస్తే పశ్చిమ జర్మనీలో కరోనా మరణాల రేటు 2.9శాతం ఎక్కువగా ఉంది. అదే ఫిన్లాండ్తో పోలిస్తే ఇటలీలో మరణాల రేటు ఏకంగా 4 రేట్లు ఎక్కువగా ఉంది. వయసు, ఆదాయం, ఆరోగ్య సదుపాయాల పరంగా ఆయా దేశాల్లో తేడాలున్నప్పటికీ.. ప్రధాన కారణం మాత్రం ఈ బీసీజీనే కావడం గమనార్హం.
Recommended Video
తూర్పు, పశ్చిమ జర్మనీలు 1990లో కలిశాయి. పశ్చిమతో పోలిస్తే తూర్పు జర్మనీలో పదేళ్ళు ముందుగానే టీబీ వ్యాక్సినేషన్ వచ్చింది. దీంతో పశ్చిమ జర్మనీలో వృద్ధులకు కరోనాతో ఎక్కువ ముప్పు ఉందని వైద్య నిపుణులు అంచనా వేశారు. ఏదైనా ఒక ప్రాంతంలో 10శాతం టీబీ వ్యాక్సిన్ కవరేజీ ఉంటే కరోనా మరణాల్లో అక్కడ 10 శాతం తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీసీజీని ఇవ్వడం వల్ల పిల్లల్లో ట్యూబర్కులోసిస్ తోపాటు ఇతర శ్వాసకోశ, అంటు వ్యాధులను కూడా నియంత్రిస్తుందని వెల్లడించారు.