కరోనాకు అలాంటి ఏ బేధమూ లేదు, జీవితాన్ని పూర్తిగా మార్చేసింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కుల, మత, జాతి, రంగు, వేష భాషలు ఏవీ చూడకుండా మనుషులపై దాడి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని ఈ వైరస్ సమానంగా ప్రభావితం చేసిందని అన్నారు. ఈ విపత్కర సమయంలో అందరం కలిసికట్టుగా, సోదరభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొత్త ఆఫీస్గా, ఇంటర్నెట్ సమావేశ గదిగా మారాయని, వృత్తి జీవితాన్ని కరోనావైరస్ పూర్తిగా మార్చేసిందని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఆఫీస్ సహచరులతో విరామ సమయం అనేది చరిత్రగా ఉండిపోనుందని లింక్డ్ ఇన్ అనే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ప్రస్తుం చోటు చేసుకున్న మార్పులను తాను అలవాటు చేసుకుంటున్నట్లు తెలిపారు.

చాలా వరకు మంత్రివర్గ సహచరులు, అధికారులు, ప్రపంచ నాయకులతో తన సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్లోనే జరుగుతున్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. అంతేగాక, సులభంగా అనుసరించగలిగే వ్యాపార, జీవనశైలి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రాణ నష్టం జరగకుండా, సంక్షోభ సమయంలో కూడా మన పనిచేయగలిగితే మన ఆఫీస్, వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాలు ఎంతో వేగంగా ముందుకు సాగుతాయన్నారు.
ఈరోజుల్లో ప్రపంచం కొత్త వ్యాపార మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఎక్కువ మంది యువత కలిగి, వినూత్న ఆలోచనలకు పేరుగాంచిన భారత్ వాటిని ప్రపంచానికి అందివ్వడంలో ముందడుగు వేయగలదని మోడీ అన్నారు.
అంతర్జాతీయంగా కరోనావైరస్ ప్రభావం తగ్గిన తర్వాత భౌతిక, వాస్తవిక సమ్మేళనంతో భారత్, అంతర్జాతీయ బహుళ ఉత్పత్తుల సరఫరాకు కేంద్రంగా మారగలదని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మనమంతా మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 16,200 కరోనా కేసులు నమోదు కాగా, 530 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications