కరోనా ఎఫెక్ట్: 23 రైళ్లను రద్దు చేసిన సెంట్రల్ రైల్వే, ఈ మార్గాలపై ప్రభావం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమవుతున్నాయి. భారత రైల్వే కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైల్వే ప్లాట్ఫాంల టికెట్లను పెంచిన రైల్వే శాఖ.. ఇప్పుడు పలు రైళ్లను కూడా రద్దు చేసింది.
విశాఖపట్నం, భువనేశ్వర్, సికింద్రాబాద్, పూరీ మధ్య నడిచే 8 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు తూర్పుకోస్తా రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కరోనావైరస్ ఆందోళనల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని.. అందుకే మార్చి 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ప్రభావం కారణంగా 23 రైళ్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా, మనదేశంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మనదేశంలో 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ సోకి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. మనదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137కు చేరిందని, ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 36 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఆ తర్వాత 24 కరోనా పాజిటివ్ కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 కేసులు నమోదయ్యాయి.
భారీగా పెరిగిన ప్లాట్ఫాం టికెట్ల ధరలు..
ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 50కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ సహా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనావ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగా రద్దీని తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ధరలు మార్చి 18 నుంచి అమల్లోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ కూడా పెంచిన ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications