16 వేలు దాటిన కరోనా కేసులు: 519కి చేరిన మరణాలు, ఆ 7 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరోనాబారినపడిన వారి సంఖ్య 16వేలు దాటింది. ఆదివారం సాయంత్రం 5గంటల వరకు కొత్తగా 1334 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు కరోనావైరస్ బారినపడి 519 మంది మరణించారని, పాజిటివ్ కేసుల సంఖ్య 16,116కు చేరిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారి నుంచి 2301 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దేశం మొత్తంలో 7 రాష్ట్రాలు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 3651 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 211 మరణాలు సంభవించాయి. రెండోస్థానంలో ఉన్న ఢిల్లీలో 1893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది మరణించారు. గుజరాత్ రాష్ట్రంలో 1604 కేసులు నమోదుకాగా, 58 మంది మృతి చెందారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1407 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 70 మంది మరణించారు. తమిళనాడులో 1372, రాజస్థాన్ లో 1351, యూపీలో 1084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23 లక్షలు దాటగా, అందులో 11 లక్షల కేసులు యూరోపియన్ దేశాల్లో నమోదయ్యాయి.
ఇక కరోనా నుంచి 5,18,900 మంది కోలుకున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 39 వేల మందికిపైగా కరోనా బారనపడి మృతి చెందగా, ఇటలీలో 23వేలు, ఫ్రాన్స్లో 19వేలు, బ్రిటన్లో 15వేలు, స్పెయిన్లో 20వేల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,60,000 మందికిపైగా మృత్యువాతపడ్డారు.