ఢిల్లీలో ఐసోలేషన్ వార్డులు సిద్దం : చైనా నుంచి వచ్చే విద్యార్థులు అక్కడికే..
Recommended Video
చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో.. అక్కడే చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనాతో సంప్రదింపులు జరిపిన అధికారులు.. అక్కడి భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశారు. అయితే భారత్ తీసుకొచ్చిన తర్వాత వారిని నేరుగా వారి స్వస్థలాలకు పంపించే అవకాశం లేదు.

మానేసర్లో ఐసోలేషన్ వార్డులు
చైనా నుంచే వారికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉండటంతో.. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి ఐసోలేషన్ వార్డులకు తరలించనున్నారు. ఇందుకోసం ఢిల్లీకి సమీపంలోని మానేసర్లో ఇప్పటికే ఐసోలేషన్ వార్డులను సిద్దం చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) ఈ ఏర్పాట్లు చేశారు. చైనా నుంచి వచ్చే విద్యార్థులను దాదాపు 2 వారాలు ఇక్కడే ఉంచి వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.చైనాలోని వుహాన్ నుంచి దాదాపు 300 మంది భారతీయులు భారత్ తిరిగొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మూడు గ్రూపులుగా విభజించి..
ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ టెస్టులను సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్(AFMS),ఎయిర్పోర్ట్ హెల్త్ అథారిటీ(APHO) సంయుక్తంగా నిర్వహించనున్నారు. టెస్టుల సందర్భంగా పేషెంట్లను మూడు గ్రూపులుగా విభజించనున్నారు. మొదటి గ్రూప్ అనుమానిత కేసులుగా పరిగణించనున్నారు. వారిని సంబంధిత ఆస్పత్రులకు తరించనున్నారు. ఇక రెండో గ్రూప్ వారిని కరోనా వైరస్కు 'దగ్గరి లక్షణాలు' ఉన్నవారిగా పరిగణిస్తారు. వారిలో వైరస్ నమూనాలు బయటపడనప్పటికీ.. ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మూడో గ్రూపు 'నాన్ కాంటాక్ట్ కేసు'గా పరిగణిస్తారు. వీరిలో ఏవిధమైనా లక్షణాలుు బయటపడవు. అయినప్పటికీ రెండు గ్రూపు వారితో పాటు వీరిని కూడా చేర్చి ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు.

14 రోజుల పాటు అక్కడే..
ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న బ్యారక్స్లో వీరికి బెడ్స్ కేటాయిస్తారు. ఒక్కో బ్యారక్లో 50మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ ప్రతీరోజూ 14 రోజుల పాటు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉండే విద్యార్థులతో పాటు ఇక్కడ పనిచేసే వైద్యులు,హౌజ్ కీపింగ్,ఇతరత్రా సిబ్బంది అంతా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(PPE)ని ధరిస్తారు. 14 రోజుల తర్వాత వారిలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని తేలితే అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపిస్తారు.

ఇప్పటివరకు 213 మంది మృతి
చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 213 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే మరో 9810మందికి కరోనా సోకినట్టు నిర్దారించారు. మరో 15238 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడివారిలో ఇప్పటివరకు 171 మంది తిరిగి కోలుకున్నట్టు చెబుతున్నారు. కరోనా వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో.. ప్రపంచం మొత్తాన్ని వైరస్ భయపెడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు దీన్ని అరికట్టడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications