coronavirus: ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు: దేశ ప్రజలకు మోడీ సందేశం
న్యూఢిల్లీ: దేశ ప్రజలు కరోనావైరస్ పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదిన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనావైరస్(కొవిడ్-19) విస్తరించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Recommended Video
కరోనావైరస్ నేపథ్యంలో రానున్న రోజుల్లో తనతోపాటు ఏ ఒక్క కేంద్రమంత్రి కూడా విదేశాలకు వెళ్లబోరని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజలు సైతం అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సమన్వయంతో ప్రజల రక్షణార్థం అనేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.
'భయపడడానికి నో చెప్పండి.. జాగ్రత్తలు తీసుకోవడానికి యస్ చెప్పండి' దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున సమూహాలు ఏర్పడకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 1500 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు వివిధ విమానాశ్రయాల్లో 10.5 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపింది.
ఇది ఇలావుండగా, కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్కు సందర్శకుల పర్యటనను నిలిపివేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్, చేంజ్ ఆఫ్ గార్డ్ సెర్మొనీకి కూడా అనుమతివ్వడం లేదని స్పష్టం చేసింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు అనుమతి నిరాకరణ అమలులో ఉంటుందని తెలిపింది.