ఏపీ, తెలంగాణ సహా: స్తంభించిపోనున్న కోట్లాదిమంది జీవనం: 75 జిల్లాల్లో: 31 వరకు బస్సులు కూడా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా భయానకంగా అలముకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో దేశం మొత్తం స్తంభించిపోయింది. దేశ ప్రజలందరూ స్వీయ గృహనిర్బంధంలో ఉంటున్నారు. స్వచ్ఛందంగా ఇళ్ల వద్దే ఉంటున్నారు. రోడ్డెక్కడానికి సాహసించట్లేదు.
దేశవ్యాప్తంగా అన్ని పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండటంలో భాగంగా రైల్వేశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజలు మూకుమ్మడిగా తిరగకుండా ఉండటం, ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడం వల్ల తేలిగ్గా వైరస్ సోకే అవకాశాలను ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఆ వెంటనే- కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన దేశంలోని 75 జిల్లాల్లో బస్సు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ 75 జిల్లాల్లో ఏపీ, తెలంగాణ నుంచి 15కు పైగా జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నెల్లూరు, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదివారం మధ్యాహ్నం ఉత్తర్వులను జారీ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భయానకంగా పెరిగిపోతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు స్తంభించిపోనున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు మెట్రో రైలు సర్వీసులకు కూడా పుల్స్టాప్ పడబోతోంది.