మహారాష్ట్రలో ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు... ఒకే హాస్టల్లో 44 మందికి పాజిటివ్...
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గురువారం(మార్చి 11) లాతూర్ పట్టణంలోని ఒకే హాస్టల్లో 44 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఆ విద్యార్థులందరినీ స్థానిక క్వారెంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే హాస్టల్లో గత నెలలో 47 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.
లాతూర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మొత్తం 146 మందికి కరోనా సోకింది. ఇందులో 91 మంది లాతూర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నివసిస్తున్న వారు కాగా... మిగతా బాధితులు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందినవారు. జిల్లాలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 715 మంది మృతి చెందారు. ప్రస్తుతం కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో జనాల్లో భయాందోళన మొదలైంది.
మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 14,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. అంతకుముందు,గతేడాది అక్టోబర్ 7న అత్యధికంగా 14,758 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 57 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 52,667కి చేరింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,66,374కి చేరింది. ఇప్పటివరకూ 21,06,400 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ఇప్పటికే పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ను అమలుచేస్తున్నారు. నాగ్పూర్లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. కిరాణా, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ మూసేస్తున్నట్టు వెల్లడించింది.
థానేలోని 16 ప్రాంతాల్లో ఈ నెల 13 నుంచి 31 వరకు లాక్డౌన్ అమలుచేయనున్నారు. నాసిక్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. ఔరంగాబాద్లో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది.