కరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు
ఇప్పుడు ప్రపంచం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకి అనారోగ్యంతో పోరాడి, ఈ వ్యాధిపై గెలిచినవారు ఆరోగ్య విషయంలో ఆ తర్వాత కూడా జాగ్రత్తలు వహించాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ సోకింది, తగ్గిపోయింది అని లైట్ తీసుకుంటే ఆ తర్వాత అనేక సమస్యలు తీవ్ర అనారోగ్యానికి గురి చేసే ప్రమాదముందని కరోనా సోకిన తగ్గిన తర్వాత బాధితుల పరిస్థితి పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చాలామంది కరోనా వైరస్ తో పోరాడి గెలిచి ఇక తమకు ఏమీ కాదని భావిస్తున్నారు. అయితే కరోనా అనంతరం శ్వాసకోశ సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మానసిక ఆందోళన, ఒత్తిడి, పిల్లలలో ఇమ్యూనిటీ లోపాలు తలెత్తుతాయని, అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కరోనా వైరస్ పై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
భారత హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాధి నుండి కోలుకున్న తర్వాత కూడా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులతో, ఒళ్ళు నొప్పులతో తిరిగి ఆసుపత్రిలోచేరిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ హెడ్ వి కె పాల్ కరోనా తగ్గిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.వ్యాధి తర్వాత వస్తున్న అనారోగ్యాలు కరోనా కు సంబంధించిన కొత్తకోణంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై శాస్త్రవేత్తలు, నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, కరోనా తరువాత సైడ్ ఎఫెక్ట్స్ గా కొన్ని అనారోగ్య సమస్యలను కొంతమంది బాధితుల్లో గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కరోనా తగ్గిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అంశాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలని, వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు జాగ్రత్తలు వహించాలని కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ హెడ్ వి కె పాల్ తెలిపారు.