కరోనా విలయం: పంజాబ్లోనూ నైట్ కర్ఫ్యూ -పంజాబ్ పరిస్థితి దారుణంగా ఉందన్న సీఎం అమరీందర్
ఉత్తరాది రాష్ట్రం పంజాబ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు పంజాబ్ సర్కారు సోమవారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇది అమలులో ఉంటుందని వెల్లడించింది.
రాత్రి కర్ఫ్యూ, వారాంతాల్లో పూర్తి లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం అమరీందర్ సింగ్ కోరారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి దిగజారితే పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పంజాబ్లో రోజువారీ కరోనా కేసుల నమోదు ఏడు వేలు దాటడం ఆందోళన రేపుతున్నది.

పంజాబ్ లో కరోనా వైరస్ పరిస్థితిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా ఉందని, అయినప్పటికీ లాక్డౌన్ విధించేందుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందని, ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
కరోనా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం శక్తికి మించి శ్రమిస్తున్నదని, మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం అమరీందర్ చెప్పారు. పంజాబ్ కు 105 టన్నుల మెడికల్ ఆక్సిజన్ కోటా ఉండగా, 85 టన్నులు మాత్రమే వచ్చిందని, మిగతాది చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్కు తరలించారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications