Big Breaking: జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం -కరోనా విలయం నేపథ్యంలో..
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుండటం, రోజువారీ కేసులు రెండు లక్షలకుపైగా, వేలల్లో మరణాలు నమోదవుతుండటం, వైరస్ కట్టది దిశగా పలు రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక చర్యకు ఉపక్రమించారు.
కోవిడ్ రెండో వేవ్ విరుచుకుపడుతున్న వేళలో ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8:45 గంటలకు జాతినుద్దేశించి తన సందేశాన్ని వినిపించనున్నారు. కరోనా విలయం ఉధృతం కాగా, వచ్చే నెల మొదటి వారం నుంచే 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. కొవిడ్ పరిస్థితులపై గడిచిన వారం రోజులుగా కీలక సమీక్షలు నిర్వహించిన ప్రధాని..
మంగళవారం నాటి సందేశంలో ఏ విషయాన్ని చెబుతారనేది ఉత్కంఠగా మారింది. దేశరాజధాని ఢిల్లీలో వారం రోజుల లాక్ డౌన్ విధింపు, చాలా రాష్ట్రాల్లో కఠిన ఆంక్షల కొనసాగింపు నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటిస్తారా? లేక ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తారా అనేది ఇంకాసేపట్లో స్పష్టం కానుంది..