130 రోజుల తరువాత కరోనా పేషెంట్ డిశ్చార్జ్: ఎన్ని చావులను కళ్లారా చూశాడో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గ్రాఫ్ పైకి ఎగబాకుతోంది. రెండురోజులుగా 30 వేలకు దిగువగా నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు ఆ సంఖ్యను దాటేశాయి. 30 వేలకు పైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా కేరళకు చెందినవే కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా తీవ్రత ఆ రాష్ట్రంలో ఇంకా తగ్గట్లేదనే సంకేతాలను పంపించినట్టయింది.

30 వేలకు పైగా..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 30,570 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 431 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 38,303 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకున్నారు. 4,43,928 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,42,923గా నమోదైంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 30,570 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో కేరళ వాటా 17,681. అత్యధికంగా 208 మరణాలు రికార్డయ్యాయి ఈ రాష్ట్రంలోనే.

130 రోజుల తరువాత డిశ్చార్జ్
కాగా- కరోనా వైరస్ సెకెండ్ వేవ్ గరిష్ఠస్థాయిలో విజృంభిస్తోన్న సమయంలో ఈ మహమ్మారి బారిన పడిన ఓ వ్యక్తి 130 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం సాగించాడు. విజయం సాధించాడు. 130 రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పేరు విశ్వాస్ సైనీ. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ ఆయన స్వస్థలం. ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చి విశ్వాస్.. ఎన్నో కరోనా మరణాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.

ఏప్రిల్లో అడ్మిట్..
ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విశ్వాస్ సైనీ అనారోగ్యానికి గురయ్యారు. కరోనా తీవ్రత గరిష్ఠ స్థాయిలో ఉన్న సమయం అది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా..పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన కొద్దిరోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్లో గడిపారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో న్యూటెమా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆరోగ్యం కుదుటపడ లేదు. ఆక్సిజన్ లెవెల్స్ 16కు పడిపోయాయి.

నెలరోజుల పాటు వెంటిలేటర్పైనే..
ఆక్సిజన్ స్థాయి పెరగకపోవడం వల్ల విశ్వాస్ సైనీని నెలరోజుల పాటు వెంటిలేటర్ మీదే ఉంచారు. ఆ తరువాత క్రమంగా కోలుకున్నారని న్యూటెమా రెసిడెంట్ డాక్టర్ ఎంసీ సైనీ తెలిపారు. చాలాకాలం పాటు ఆయన శరీరం వైద్యానికి స్పందించలేదని, ఇక కోలుకోలేకపోవచ్చనే నిర్ధారణ సైతం తాము వచ్చినట్లు పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతోనే ఆయన మరణం అంచుల నుంచి బయటపడగలిగారని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఆక్సిజన్ను అందించాల్సి వచ్చేదని పేర్కొన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ మీద ఎక్కువరోజులు ఉండటం వల్ల ఆయన ముఖం మీద గుర్తుల ఏర్పడ్డాయి.
Recommended Video

ఎన్ని చావులను చూశానో..
డిశ్చార్జ్ అయిన తరువాత మీరట్లోని తన నివాసానికి చేరుకున్నారు విశ్వాస్ సైనీ. 130 రోజుల్లో అనేక కరోనా మరణాలను తాను కళ్లారా చూశానని పేర్కొన్నాడు. ఎంతోమంది తన కళ్లెదురుగా ప్రాణాలు వదిలారని అన్నాడు. రోజూ పదుల సంఖ్యలో చావు కబుర్లను వినాల్సి వచ్చేదని చెప్పాడు. ఆ సమయంలో తనకు కూడా చావు తప్పదని భావించానని, ఆసుపత్రి డాక్టర్లు, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వచ్చారని వ్యాఖ్యానించాడు












Click it and Unblock the Notifications