సోనియా-దీదీ బంధానికి అప్పుడే బీటలు- గోవా ఫిరాయింపుల చిచ్చు-జాతీయ కూటమికీ బ్రేక్
దేశవ్యాప్తంగా బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు రెండు నెలల క్రితం విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఓ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత మమతా బెనర్జీ విడిగా ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి వెళ్లారు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
జాతీయ ప్రత్యామ్నాయ కూటమి
జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ రోజురోజుకూ పతనావస్ధకు చేరుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కోసం వివిధ విపక్ష పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వంటి వారు దీనికి అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఇందులో వీరిద్దరి గెలుపు కోసం గతంలో వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ వంటి వారు కూడా తోడయ్యారు. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో వీరు ఓ భేటీ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి రావడం ఖాయమని అంతా భావించారు.
మమత-సోనియా భేటీ
జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు వీలుగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా నెలన్నర క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లి కలిసివచ్చారు. వీరిద్దరి భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసే కూటమి గురించి కూడా చర్చించారు. తాను తరచుగా ఢిల్లీకి వస్తుంటానని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉంటానని మమత అప్పట్లో ప్రకటించారు. దీంతో అంతా సవ్యంగా సాగిపోతోందని అందరూ భావించారు. కానీ ఈ ముచ్చట మూన్నాళ్లే అయింది. సోనియాగాంధీతో భేటీ అయి చర్చించిన విషయాలు, అజెండాపై మరోసారి మమత మాట్లాడలేదు.
గోవాలో మమత అడుగులు
జాతీయస్ధాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసిన మమతా బెనర్జీ.. అంతకుముందే పలు రాష్ట్రాల్లో సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం వచ్చే ఏడాది జరిగే గోవా ఎన్నికలపై ఆమె దృష్టిపెట్టారు. గోవాలో బీజేపీ ప్రాభవానికి గండికొట్టేందుకు టీఎంసీని ఆమె సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం గోవాకు టీఎంసీ నేతలు డెరెక్ ఓబ్రెయిన్, ప్రసూన్ బెనర్జీని కూడా పంపారు. వీరిద్దరూ అక్కడి రాజకీయాల్ని అధ్యయనం చేశాక కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వరుసగా నేతలు తృణమూల్ కు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరుగుతోంది.
Recommended Video
మమత-సోనియా బంధానికి ఆదిలోనే..
మమతా బెనర్జీ, సోనియాగాంధీ మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత వీరిద్దరి మధ్య బంధం బలపడుతుందని అంతా భావించారు. కానీ గోవా రాజకీయం పెట్టిన చిచ్చుతో ఇప్పుడు వీరిద్దరి మధ్య బంధం సంగతి తర్వాత వీరి నేతృత్వంలోని పార్టీల మధ్య మాటలయుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని తృణమూల్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గోవాలో కాంగ్రెస్ అవకాశాలకు గండికొట్టేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను సైతం వారు సమర్ధించుకుంటున్నారు. దీంతో మమత-సోనియా కలయికకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లయింది. అదే సమయంంలో జాతీయ స్దాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.